ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతుంది. బెంగళూరు వేదికగా వచ్చే నెల 12, 13వ తేదీల్లో వేలం జరగనుంది. ఇందులో 1214 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో భారత్కు చెందిన ఆటగాళ్లు 896 మంది ఉండగా.. విదేశాలకు చెందిన ఆటగాళ్లు 318 మంది ఉన్నారు. కాగా ఈ సారి ఐపీఎల్లో రెండు కొత్త జట్లు కూడా పాల్గొననున్నాయి. దీంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరుకోనుంది. కొత్త జట్లైనా అహ్మదాబాద్, లక్నో ఇప్పటికే తమ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాయి. లక్నో జట్టు కేఎల్ రాహుల్, రవి బిష్ణోయి, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ను ఎంపిక చేసుకుంది. కాగా రాహుల్కు 17 కోట్లు, స్టోయినిస్కి రూ.9.2 కోట్లు, రవి బిష్ణోయ్కి రూ.4 కోట్లు చెల్లించేందుకు లక్నో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. అంతకు ముందే లక్నో టీమ్కు మెంటార్గా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎంపికయ్యారు.
ఈ నేపథ్యంలో లక్నో ప్రాంచైజీ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ను రిటెన్షన్ చేసుకోవడానికి గల కారణాన్ని ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ వివరించారు. ఈ సీజన్లో ఐపీఎల్కు దూరంగా ఉండే అవకాశం ఉన్న ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ తర్వాత ఆ స్థాయి సామర్థ్యం ఉన్న ఆటగాడు సోయినిసేనని తెలిపారు. స్టోయినిస్ బ్యాటింగ్ చేస్తాడని, బౌలింగ్ చేస్తాడని, అత్యుత్తమ బౌలర్లలో అతను ఒకడని గంభీర్ చెప్పారు. అలాగే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో స్టోయినిస్ ఆటను చూశామని, ఒంటి చేతితో మ్యాచ్ను గెలిపించగలడని చెప్పుకొచ్చారు. అలాగే రెండు సార్లు ప్రపంచకప్ విజేత అయినా ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ ఈ సారి ఐపీఎల్కు అందుబాటులో ఉండడంపై స్పష్టత లేనందున, మార్కస్ స్టోయినిస్ను ఎంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడమే కాకుండా మ్యాచ్ను గెలిపించే సత్తా స్టోయినిస్కు ఉందని గంభీర్ పేర్కొన్నారు.
కాగా గత రెండు ఎడిషన్లలో స్టోయినిస్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఈ క్రమంలో 142 స్ట్రైక్రేట్తో 441 పరుగులు చేశాడు. 15 వికెట్లు కూడా తీశాడు. తన కెరీర్లో ఇప్పటివరకు ఐపీఎల్లో 56 మ్యాచ్లు ఆడి 27 సగటుతో 914 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలు చేయగా.. అత్యధిక స్కోర్ 65 పరుగులు. ఈ క్రమంలో 76 ఫోర్లు, 35 సిక్స్లు బాదాడు. అలాగే 30 వికెట్లు కూడా తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/15.