హైదరాబాద్: గౌతం గంభీర్... భారత క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఆడనప్పటికీ, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంలో ముందుంటున్నాడు. ముఖ్యంగా దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులకు ఏం జరిగినా తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందిస్తున్నాడు.
గతంలో ఛత్తీస్గఢ్లోని సుక్మాలో మావోయిస్టుల దాడిలో చనిపోయిన 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల పిల్లల చదువులకయ్యే ఖర్చును తానే భరిస్తానని గంభీర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన ఏఎస్ఐ అబ్దుల్ రషీద్ కుటుంబానికి కూడా మద్దతుగా నిలిచాడు.

అతని కుమార్తె చదువు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ సందర్భంగా గంభీర్ మనసు చలించిపోయే వ్యాఖ్యలు చేశాడు.
'నీ కలలను సాకారం చేసుకోవడానికి నేను సాయం చేస్తా. జీవితాంతం నీ చదువుకయ్యే ఖర్చంతా భరిస్తా. ప్లీజ్ జోహ్రా.. నీ కన్నీళ్లు బయటకు రానీయకు. భూమాత కూడా నీ బాధను మోయలేదేమో. మీ నాన్నకు సెల్యూట్' అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గంభీర్ చూపిన ఔదార్యానికి జోహ్రా కృతజ్ఞతలు తెలిపింది. తాను డాక్టర్ కావాలని అనుకుంటున్నట్టు తెలిపింది. దీనికి గౌతీ వెంటనే స్పందిస్తూ 'జోహ్రా బేటా నాకు థ్యాంక్స్ చెప్పకు. నా కుమార్తెలు అజీన్, అనైనాలాగే నువ్వూ. డాక్టర్ కావాలనుకుంటున్నావుగా. నీ కలల వెంట పరిగెత్తు. మేమంతా నీ వెంట ఉన్నాం' అని గంబీర్ ట్వీట్ చేశాడు.