టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫామ్ గురించి వస్తున్న విమర్శలపై భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. రాహుల్కు మరోసారి మద్దతిస్తూ వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో చివరి రెండు టెస్టుల్లో తుదిజట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-ఏ జట్టు తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా-ఏతో రెండో అనధికారిక టెస్టులో ఆడిన కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్లో 4 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్లో 10 పరుగులకే వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్లో రాహుల్ ఔటైన తీరు చర్చనీయాంశంగా మారింది. ఏకాగ్రత లేకుండా, పేలవంగా షాట్కు యత్నించి వినూత్న రీతిలో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో నెట్టింట్లో విపరీతమైన ట్రోల్స్కు గురయ్యాడు.

అయితే రాహుల్కు గంభీర్ మద్దతు ఇచ్చాడు. ప్రపంచంలో ఏ జట్టులో కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్ ఉండడని పేర్కొన్నాడు. జట్టు కోసం అవసరమైతే రాహుల్ ఓపెనర్గా వస్తాడని, ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని, అంతేగాక వికెట్ కీపర్గా బాధ్యతలు అందుకుంటాడని.. ఇలా విభిన్న పాత్రలతో జట్టును ఆదుకునే ప్లేయర్లు చాలా అరుదు అని గంభీర్ అన్నాడు. ఇలా అన్ని పనులు చేయడానికి ఎంతో నైపుణ్యం ఉండాలన్నాడు.
పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే కేఎల్ రాహుల్ను ఓపెనర్గా పరిణించే అవకాశాలు ఉన్నాయని గంభీర్ చెప్పాడు. రాహుల్, అభిమన్యు ఈశ్వరన్లలో ఒకరికి ఓపెనర్గా అవకాశం ఇస్తామని అన్నాడు. ఆస్ట్రేలియాకు బయలుదేరనున్న నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.
నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో భారత్కు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ అత్యంత కీలకం. కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు. కాగా, 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే గెలుస్తోంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ భారత్దే విజయం.