ఐపీఎల్-2024లో మెగా సమరానికి వేళైంది. చెపాక్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్-సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. టాప్-2లో నిలిచిన ఈ ఇరు జట్లు బలాబలాల్లో సమవుజ్జీలు. భీకర హిట్టర్లు, టాలెంటెడ్ బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు. దీంతో రేపటి పోరు హోరాహోరీగా సాగడం ఖాయమే.
ఈ సీజన్లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ రెండు సార్లు తలపడ్డాయి. రెండింట్లోనూ కోల్కతానే పైచేయి సాధించింది. సన్రైజర్స్పై లీగ్ మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో, క్వాలిఫయిర్-1లో ఎనిమిది వికెట్ల తేడాతో కేకేఆర్ నెగ్గింది. ఐపీఎల్లో ఓవరాల్గా ఇరు జట్లు 27 మ్యాచ్లు ఆడగా మూడింట రెండో వంతు కోల్కతానే విజయం సాధించింది. సన్రైజర్స్ తొమ్మిదింట్లోనే గెలిస్తే, కేకేఆర్ 18 మ్యాచ్ల్లో విజయఢంకా మోగించింది.

గణాంకాల పరంగా సన్రైజర్స్పై కోల్కతానే పైచేయి. దీంతో రేపటి ఫైనల్లోనూ శ్రేయస్ సేన విజృంభించే అవకాశాలు ఎక్కువ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫైనల్ ముంగిట ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ జట్టుకు దూరమవ్వడం కేకేఆర్ను కలవరపెడుతోంది. కోల్కతా సాధించిన విజయాల్లో గంభీర్ది కీలకపాత్ర.లక్నో సూపర్ జెయింట్స్ను విడిచి ఈ సీజన్లో కోల్కతా జట్టుకు మెంటార్గా గంభీర్ బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే.
గంభీర్ రాకతో కేకేఆర్ దూకుడు పెంచింది. సునీల్ నరైన్ తిరిగి ఓపెనర్ అవతారమెత్తి సత్తాచాటుతున్నాడు. యువ ఆటగాళ్లు బెదురులేని ఆట ఆడుతున్నారు. జట్టు విజయాల్లో గంభీర్ది ప్రధాన పాత్ర అని కేకేఆర్ ఆటగాళ్లు సైతం పేర్కొంటున్నారు. అయితే కీలక సమయంలో కేకేఆర్ జట్టుకు గంభీర్ దూరమయ్యాడు. సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ నేపథ్యంలో గంభీర్ జట్టును వీడాడు.
ఈస్ట్ ఢిల్లీలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం చెన్నై నుంచి గంభీర్ ఢిల్లీకి వెళ్లాడు. శనివారం ఉదయం ఓటు వేశాడు. గత ఎన్నికల్లో గంభీర్ ఈస్ట్ ఢిల్లీ తరఫున లోక్సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ సాయంత్రం గంభీర్ కేకేఆర్ జట్టుతో చేరే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ ఫైనల్కు ఎక్కువ సమయం లేకపోయినా, జట్టును విడిచిపెట్టి ఓటు వేయాలనుకున్న గంభీర్ నిర్ణయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. గంభీర్లా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని అంటున్నారు.