కోల్ కత్తా: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి, బోర్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్తో అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని టీమిండియా ఆటగాడు గంభీర్ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మద్దతు తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నిజానికి ఇది చాలా దురదృష్టకరమైన అంశం అయినప్పటికీ, పాకిస్తాన్తో కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడకుండా ఉంటేనే మంచిదని ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఓవైపు మన జవాన్లను చంపుతుంటే పాక్తో క్రికెట్ ఎలా ఆడుతామని ప్రశ్నించాడు.
పాక్ తీవ్ర చర్యలను, చేష్టలను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలంటే ఆ దేశ నటీనటులను ఇక్కడ ఆదరించొద్దని బుధవారం గంభీర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. క్రికెట్, సినిమాలను జాతీయ మనోభావాలకు భిన్నంగా చూడాలని బాలీవుడ్ ప్రముఖులు చెప్పడం తనకు దిగ్ర్భాంతిని కలిగించిందని గంభీర్ పేర్కొన్నాడు.

సరిహద్దుల్లో పాకిస్థాన్ తరచు ఉగ్రదాడులకు తెగబడుతున్న కారణంగా కొన్ని సందర్భాలలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. టెర్రరిజం పేరుతో మన జవాన్లను చంపేస్తుంటే పాక్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం భావ్యమేనా? అని ప్రశ్నించాడు.
'క్రీడల కంటే భారతీయుల ప్రాణాలు ఎంతో విలువైనవి. పాక్తో క్రికెట్ ఆడాలన్న ఊహ రాదు' అని గంభీర్ అన్నాడు. ఉగ్రవాదం కారణంగా ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమాధానం చెప్పాలని గంభీర్ చేసిన వ్యాఖ్యలపై గంగూలీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇదిలా ఉంటే కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ ఇదివరకే ఈ విషయంపై మాట్లాడుతూ.. భారత్-పాక్ సిరీస్లపై తుది నిర్ణయం సంబంధిత క్రీడా బోర్డులకు వదిలేస్తున్నామని చెప్పారు.