న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. రెండో రోజు గురువారం ఓపెనర్ గౌతం గంభీర్ డబుల్ సెంచరీ సాధించాడు. 206 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గంభీర్ వాట్సన్ బౌలింగులో అవుటయ్యాడు. రెండో రోజున హైదరాబాద్ బ్యాట్స్ మెన్ వీవీఎస్.లక్ష్మణ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గంభీర్ అవుటైన తర్వాత బ్యాటింగుకు దిగిన సౌరవ్ గంగూలీ ఐదు పరుగులకే అవుటయ్యాడు. ధోనీ 27 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. ఈ వార్త రాసే సమయానికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 483 పరుగులు చేసింది. లక్ష్మణ్ 145 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతూ పటిష్టస్థితిలో ఉంది. అంతకుముందు తొలి రోజున సచిన్ (68) సహకారంతో గంభీర్ రెచ్చిపోయిన విషయం తెల్సిందే. తొలి రోజు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి గంభీర్ 149 పరుగులతో క్రీజ్ లో నాటౌట్ గా నిలిచాడు. అలాగే లక్ష్మణ్ కూడా అర్థ శతకం (54) పూర్తి చేసుకుని గంభీర్ కు మంచి సహకారం అందించారు. గురువారం రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత గంభీర్-లక్ష్మణ్ లు ఆచితూచి ఆడుతూ స్కోరును పెంచారు. వీరిద్దరు నాలుగో వికెట్ కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించిన గంభీర్ - లక్ష్మణ్ భాగస్వామ్యాన్ని విడదీయలేక పోయారు. దీంతో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత ఆటగాళ్ళ పరుగుల వరద పారిస్తున్నారు.