టీమిండియా కొత్త కోచ్ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతానే ఉంది. ఈ పదవికి బీసీసీఐ దరఖాస్తుల కోరినప్పటి నుంచి రోజుకో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకుంటాడని ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే ఇటీవల గంభీర్.. కోచ్ పదవికి మించిన మరో అరుదైన గౌరవం ఉండదని పేర్కొనడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకోనున్నట్లు ఫిక్స్ అయ్యారు. అయితే ద్రవిడ్కు వారసుడిగా గంభీర్ సరైనోడే అని, కానీ కోచ్ పదవిలో కొన్ని సవాళ్లు ఉంటాయని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. ఫ్రాంచైజీ జట్టు, భారత జట్టు కోచ్ పదవి ఒకటి కాదని అన్నాడు. గంభీర్ కుదురుకోవడానికి సమయం ఇవ్వాలని తెలిపాడు. వర్తమానంతో పాటు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని జట్టును సిద్ధం చేయాలని సూచించాడు.

''రాహుల్ ద్రవిడ్ కోచ్ పాత్రను అద్భుతంగా పోషించాడు. వరల్డ్ కప్తో అతనికి గొప్ప ముగింపు దక్కాలని ఆశిస్తున్నా. అయితే మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు తమ కెరీర్ ముగింపుకు వచ్చారు. ఈ పరివర్తన కాలంలో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నాణ్యత తగ్గకుండా ఉండటానికి జట్టులో సరైన ఆటగాళ్లు అవసరం. వాళ్లను ఎంపిక చేసి జట్టును అదే జోరులో కొనసాగించాలి. గౌతమ్ గంభీర్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలడు''
''గంభీర్కు ఆ సామర్థ్యం ఉంది. కానీ అతనికి కాస్త సమయాన్ని ఇవ్వాలి. గంభీర్ టీమ్స్ను నడిపించిన విధానాన్ని చూశాం. అయితే ఫ్రాంచైజీ క్రికెట్ భారత జట్టు భిన్నమైనది. గంభీర్ కోచ్ పదవి చేపడితే అతడు వర్తమానం గురించే కాకుండా భారత క్రికెట్ భవిష్యత్ గురించి కూడా ఆలోచిస్తాడు. కాగా, భారత జట్టుకు ఆడే అర్హత కలిగి ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయాలి. ఈ విషయంలో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి'' అని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ద్రవిడ్ కోచ్ బాధ్యతలకు గుడ్బై పలకనున్న విషయం తెలిసిందే.