న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా గంభీర్ , సచిన్ , లక్ష్మణ్ ల రాణింపుతో భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా జట్టు 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాహుల్ ద్రావిడ్ 11 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సచిన్, గంభీర్ తో కలిసి నిలకడగా ఆడుతూ స్కోరును పెంచారు. వీరిద్దరూ మూడో వికెట్ కు వంద పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.లంచ్ అనంతరం సచిన్ టెస్ట్ ల్లో తన 51 వ అర్ధసెంచరీనీ సాధించి 68 పరుగుల వద్ద వెనుదిరిగాడు. సచిన్ కు మంచి సహకారమందించిన గంభీర్ నిలకడగా ఆడి తన కెరీర్ లో మూడో సెంచరీని సాధించాడు.ఆసీస్ బౌలర్లలో జాన్సన్ రెండు వికెట్లు, బ్రెట్ లీ ఒక వికెట్ సాధించాడు. టెండూల్కర్ వెనుదిరిగిన అనంతరం గంభీర్, లక్ష్మణ్ లు ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటున్నారు. లక్ష్మణ్ తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. గంభీర్ 149 పరుగులతో, లక్ష్మణ్ 54 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ప్రారంభంలోనే ఓపెనర్ సెహ్వాగ్ వికెట్టును కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన వీరేంద్ర సెహ్వాగ్ బ్రెట్ లీ బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా పెవిలియన్ గా వెనుదిరిగాడు.భారత జట్టులో మూడో టెస్టుకు ఒక మార్పు జరిగింది. హర్భజన్ స్థానంలో అమిత్ మిశ్రాకు చోటు దక్కింది. రెండు టెస్టు మ్యాచులో అనిల్ కుంబ్లే స్థానంలో మైదానంలోకి దిగి విశేష ప్రతిభను కనబరిచిన అమిత్ మిశ్రాకు మూడో టెస్టు మ్యాచులో కూడా అవకాశం వచ్చింది. ప్రాక్టీస్ సందర్భంగా హర్భజన్ సింగ్ వేలికి గాయమైంది. దీంతో అతను మూడో టెస్టులో ఆడడం లేదు. ఆ స్థానంలో మిశ్రా వచ్చాడు.