చెస్టర్-లీ-స్ట్రీట్: యువ క్రికెటర్ అంబటి రాయుడు అర్ధాంతరంగా తన కేరీర్కు గుడ్బై చెప్పడం టీమిండియా మాజీ ఓపెనర్, లోక్సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. యువ క్రికెటర్ల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రపంచకప్ టోర్నమెంట్లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు గంభీర్. బుధవారం చెస్టర్-లీ-స్ట్రీట్లోని రివర్సైడ్ దుర్హం స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా గంభీర్ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్యానెల్పై నిప్పులు చెరిగారు.
థ్యాకింగ్ యు సర్: యువర్స్ సిన్సియర్లీ..! బీసీసీఐకి అంబటి ఇమెయిల్: పూర్తి సారాంశం ఇదే!
సెలెక్షన్ కమిటీ ప్యానెల్లో ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సహా మొత్తం అయిదుమంది సభ్యులు ఉన్నారని, వారందరూ క్రికెటర్లేనని అన్నారు. క్రికెట్లో ఈ అయిదుమంది చేసిన పరుగులన్నింటినీ కలుపుకొన్నప్పటికీ.. అంబటి రాయుడు చేసిన రన్స్కు సరి తూగవని అన్నారు. అలాంటి ఆటగాళ్లను సెలెక్షన్ కమిటీలో ఎలా నియమించారో తనకు అర్థం కావట్లేదని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు.
అంబటి రాయుడు రిటైర్మెంట్ తనను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందని చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సహా జాతీయ జట్టు తరఫున ఆ యువ క్రికెటర్ అద్భుతంగా ఆడిన మ్యాచ్లు ఉన్నాయని అన్నారు. వాటన్నింటిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా- అంబటి రాయుడిని పక్కన పెట్టడం సెలెక్షన్ కమిటీ ప్యానెల్ సభ్యుల ద్వంద్వనీతికి అద్దం పడుతోందని ఆరోపించారు. సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు, వారి వైఖరి వల్లే అంబటి రాయుడు అర్ధాంతరంగా తన కేరీర్ను ముగింపు పలికాడని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు.