హైదరాబాద్: శ్రీలకంతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. పుజారా 144, రహానే 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు
అజేయంగా 112 పరుగులు జోడించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ శిఖర్ ధావన్ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని నమోదు చేశాడు. 168 బంతుల్లో 31 ఫోర్ల సాయంతో 190 పరుగులు చేసి అవుటయ్యాడు. ధావన్, పుజారాలు రెండో వికెట్కు 253 పరుగులు జోడించారు.
ఇక ఓపెనర్ అభివన్ ముకుంద్, 12, కెప్టెన్ కోహ్లీ 3 పరుగులు చేసి అవుటయ్యారు. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్ 3 వికెట్లు తీసుకున్నాడు.
తొలి రోజు: టీమిండియా ఇన్నింగ్స్ సాగిందిలా:
పుజారా సెంచరీ
లంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాట్స్మెన్ పుజారా సెంచరీ చేశాడు. ఓపెనర్ అభినవ్ ముకుంద్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా.. ధావన్తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 67వ ఓవర్లో లాహిరు కుమార వేసిన 5వ బంతిని ఎదుర్కొన్న పుజారా రెండు పరుగులు తీసి సెంచరీ సాధించాడు.
టెస్టుల్లో పూజారాకు ఇది 12వ సెంచరీ. డ్రింక్స్ విరామానికి గాను 72 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 335 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా 109, రహానె 15 పరుగులతో ఉన్నారు.

భారీ షాట్ ఆడబోయి పెవిలియన్కు చేరిన కోహ్లీ
లంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ 3 పరుగుల వద్ద ప్రదీప్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయిన కోహ్లీ భారీ షాట్ ఆడబోయాడు. బంతి బ్యాట్ అంచుకు తాకి కీపర్ డిక్వెలా చేతిలో పడింది. దీంతో అవుటయ్యాడు. కోహ్లీ అవుటైన తర్వాత రహానే క్రీజులోకి వచ్చాడు.
టీ విరామానికి భారత్ 282/2: ధావన్ డబుల్ సెంచరీ మిస్
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా టీ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 75, కోహ్లి ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. ఈ టెస్టులో ధావన్ తొలి డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. 190 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రదీప్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.
అయితే టెస్టుల్లో ధావన్కి ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఆస్ట్రేలియాపై చేసిన 187 స్కోరును అతను అధిగమించాడు. అప్పట్లో ఆ స్కోరుని కూడా ధావన్ తొలి రోజే సాధించడం విశేషం. ఇప్పుడు కేవలం 168 బంతుల్లో 31 ఫోర్ల సాయంతో 190 పరుగులు చేశాడు. ధావన్ ఇన్నింగ్స్ టీ20ని తలిపించింది. పుజారాతో కలిసి రెండో వికెట్కు 153 పరుగులు జోడించాడు.
పుజారా హాఫ్ సెంచరీ... 200కు చేరువైన భారత స్కోరు
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పుజారా హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో భారత స్కోరు 200 పరుగులకు చేరువైంది. భారత బ్యాట్స్ మెన్లను కట్టడి చేయడంలో లంక బౌలర్లు విఫలమవుతున్నారు. దీంతో 38 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు రెండో వికెట్కి అజేయంగా 157 పరుగులు జోడించారు.లంక బౌలర్లలో ప్రదీప్ కు మాత్రమే వికెట్ దక్కింది. లంచ్ విరామం వరకూ నెమ్మదిగా ఆడిన ఈ జోడీ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నారు. ప్రస్తుతం ఓవర్కు ఆరు పరుగులకు పైగా పరుగులను సాధిస్తున్నారు.

శిఖర్ ధావన్ సెంచరీ
శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ నమోదు చేశాడు. 110 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో ధావన్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో ధావన్కి ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. ప్రారంభం నుంచి నిలకడగా ఆడుతూ లంక బౌలర్లపై విరుచుకుపడిన ధావన్ సెంచరీని నమోదు చేశాడు.

లంచ్ విరామ సమయానికి 64 పరుగులతో ఉన్న ధావన్ లంచ్ విరామం అనంతరం మరింత జోరు పెంచాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే 35వ ఓవర్లో దిల్రువన్ పెరీరా వేసిన తొలి బంతిని బౌండరీకి తరలించిన ధావన్ తన టెస్టు కెరీర్లో ఐదో సెంచరీని నమోదు చేసుకున్నాడు. మరో ఎండ్ లోని పుజారా మాత్రం కాస్తంత నిదానంగా ఆడుతూ, 72 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి దగ్గరయ్యాడు.
ప్రస్తుతం టీమిండియా 35 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 161 పరుగులు చేసింది. టెస్టుల్లో రెండేళ్ల తర్వాత ధావన్ సెంచరీ చేశాడు. ఇదే గాలేలో శ్రీలంకపై 2015లో ధావన్ సెంచరీ చేయడం గమనార్హం.
లంచ్ విరామానికి భారత్ 115/1
మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో లంచ్ విరామానికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 115 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ 64, పుజారా 37 పరుగులతో ఉన్నారు. టాస్ గెలిచిన కోహ్లీ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
హాఫ్ సెంచరీ చేసిన శిఖర్ ధావన్
జట్టు స్కోరు 27 పరుగుల వద్ద ప్రదీప్ బౌలింగ్లో ఓపెనర్ అభివన్ ముకుంద్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి ధావన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వికెట్ కాపాడుకుంటూ ధావన్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ 62 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు.

2016 తర్వాత అతడు హాఫ్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. టెస్టుల్లో ధావన్ నాలుగో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 27 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన భారత్ను ధవన్-పుజారా జోడి ఆదుకుంది. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా ఆడుతూ స్కోరు బోర్డును వంద పరుగులు దాటించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన
గాలే వేదికగా ఇండియా-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఈ టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేస్తున్నాడు.
మరోవైపు అనారోగ్యం కారణంగా తొలి టెస్టుకు కేఎల్ రాహుల్ దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో అభినవ్ ముకుంద్ను తీసుకున్నారు. ఇదిలా ఉంటే టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ఇది 50వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.
2015లో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా గాలేలో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని సిరిస్ను కైవసం చేసుకుంది. అయితే ఈసారి శ్రీలంకపై విజయంతో గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు ఈ పర్యటనలో శుభారంభం అందుకోవాలని కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతోంది.
ఇప్పటివరకు భారత్, శ్రీలంక జట్ల మధ్య 7 టెస్టు సిరిస్లు జరగ్గా భారత్ 2 గెలవగా, 3 ఓడింది. మరో 2 సిరీస్లు డ్రాగా ముగిశాయి. ఇరు జట్ల మధ్య జరిగిన 21 టెస్టుల్లో భారత్ 6 గెలవగా, 7 ఓడింది. మరో 8 డ్రా అయ్యాయి. గాలేలో ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టులు జరగ్గా.. భారత్ ఒక మ్యాచ్లో నెగ్గింది. లంక మూడింటిలో గెలిచింది.
జట్ల వివరాలు:
ఇండియా:
శ్రీలంక: