అడిలైడ్: అడిలైడ్లో పాకిస్తాన్ జట్టు పైన భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్ పైన భారత్ తరఫున ఇప్పటి వరకు ఎవరు కూడా సెంచరీ చేయలేదు. ఇప్పుడు కోహ్లీ సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు.
పాక్ పైన భారత్ గెలుపొందడం, విరాట్ కోహ్లీ వీరవిహారం నేపథ్యంలో ఇంటర్నెట్, సెల్ఫోన్లలో ఓ ఆసక్తికర సందేశం కనిపిస్తోంది. బాలీవుడ్ నటి అనుష్క శర్మ పేరుతో విరాట్ కోహ్లీని భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ రెచ్చగొట్టాడని.. ఇలా పలు సరదా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

కోహ్లీ బ్యాట్ పట్టుకొని మైదానంలో అడుగుపెట్టేముందు.. కెప్టెన్ ధోనీ అతనిని ఆపాడని, కోహ్లీ.. నీ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను పీకే సినిమాలో ప్రేమించింది పాకిస్తానీయేనని రెచ్చగొట్టాడని, దాంతో కోహ్లీ రెచ్చిపోయాడని వాట్సప్లో ఓ జోక్ కనిపించింది. ఇది అందరినీ ఆకర్షించింది.
అదే సమయంలో మరో ప్రకటన కూడా ఆకర్షించింది. ప్రపంచకప్లో భారత్, పాకిస్తాన్ పోరు నేపథ్యంలో కొన్ని రోజులుగా టీవీలో ఓ ప్రకటన సందడి చేసింది. 1992లో ఓ పాకిస్తాన్ అభిమాని భారత్ - పాక్ మ్యాచ్ చూస్తూ.. బుట్టలో టపాకాయలు పట్టుకొని సిద్ధంగా ఉంటాడు. పాక్ గెలవగానే వాటిని పేల్చేందుకు.
ఓడిపోవడంతో వాటిని అటకమీద పెడతాడు. ఆ తర్వాత 1996లోను వాటిని కిందకు దించుతాడు. అప్పుడు కూడా ఓడటంతో మళ్లీ అటకెక్కిస్తాడు. 1999, 2003, 2007, 2011లలోను అలాగే జరుగుతుంది. 2013లో తన పిల్లలతో కలిసి టపాకాయలు కిందకు దించుతాడు. ఈసారి కూడా అదే పునరావృతం అవుతుంది. వాటిని 2019 వరకు అటకమీదకెక్కించు అంటూ సరదా జోకులు పేలుతున్నాయి.