
లండన్: ప్రపంచంలో క్రికెట్ టోర్నమెంట్లన్నింటికీ పెద్దన్న ప్రపంచకప్. అలాంటి మెగా టోర్నమెంట్లో వర్షం పడి.. చివరికి భారత్ ఆడుతున్న మ్యాచ్ కూడా ఒక్క బంతి అయినా పడక ముందే రద్దు కావడం అంటే ఫ్యాన్స్కు ఎలా ఉంటుంది? మండిపోదూ! తమ ఆవేదనను, ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని బయటికి ఎలా చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? తమ ఫస్ట్రేషన్ను ఎవరిపై చూపాలి? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులందరి టార్గెట్ ఒక్కటే. అదే ఐసీసీ. క్రికెట్ ఆడే గ్రౌండ్లపై వరుణ దేవుడు వాన కురిపిస్తోంటే.. అభిమానులు ఐసీసీపై విమర్శల జడివానతో దాడి చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.
మ్యాచ్ కోసం డబ్బులు వసూలు చేసి.. వర్షాన్ని చూపిస్తారా?
అసలే ప్రపంచకప్. కోహ్లీ సేన మాంఛి ఊపులో ఉంది. ఎదురుగా ఎలాంటి బలమైన జట్టయినా తుత్తునీయలు చేసేలా కనిపిస్తోంది. 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న బైక్కు అడ్డంగా స్పీడ్ బ్రేకర్ వస్తే ఎలా అసహనానికి గురవుతారో.. సరిగ్గా అలాగే తయారైంది టీమిండియా డైహార్డ్ ఫ్యాన్స్ పరిస్థితి. క్రికెట్ మ్యాచ్ను చూపిస్తామని వందలాది రూపాయలను టికెట్ల రూపంలో వసూలు చేస్తోన్న ఐసీసీ నిర్వాహకులు.. చివరికి వర్షాన్ని తమకు అంటగడుతున్నారని ఫైర్ అవుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. బోడి వర్షాన్ని చూడటానికి తాము ఇంత దూరం రావాల్సిన అవసరం ఉందా? అంటూ నిలదీస్తున్నారు. భారత్ మ్యాచ్ కూడా వర్షం పాలు కావడాన్ని ఏ మాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు.
తమ దాకా వస్తే కానీ..
నిజానికి- వర్షం బారిన పడి భారత్-న్యూజీలాండ్ మ్యాచ్ రద్దు కావడం తొలిసారేమీ కాదు. ఇదివరకు నాలుగు మ్యాచ్లు ఇలాగే రద్దయ్యాయి. శ్రీలంక-పాకిస్తాన్, శ్రీలంక-బంగ్లాదేశ్, వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్లు కూడా ఇలాగే రద్దయ్యాయి. అప్పట్లో వాటిని పెద్దగా పట్టించుకోలేదు క్రికెట్ ప్రియులు. తమ దాకా వస్తే గానీ తెలియదన్నట్లుగా.. తీరా టీమిండియా మ్యాచ్ కూడా రద్దయ్యేటప్పటికీ నొప్పి తెలిసి వచ్చినట్టుంది. ఐసీసీతో ఓ ఆట ఆడుకుంటున్నారు. చెడుగుడు ఆడి పడేస్తున్నారు. తమ ఆగ్రహానికి కాస్త సృజనాత్మకతను జోడించి మరీ మెమెలను తయారు చేసి, సోషల్ మీడియాలో అలా వదిలేస్తున్నారు. అవి తెగ హల్చల్ చేస్తున్నాయి.