The Hundred 2025:"ది హండ్రెడ్ 2025" టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో ఒక ఊహించని, హాస్యభరితమైన సంఘటన చోటుచేసుకుంది. క్రికెట్ పుట్టినిల్లు అయిన లండన్లోని లార్డ్స్ స్టేడియంలో లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక నక్క అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చింది. ఈ సంఘటనతో స్టేడియంలోని ప్రేక్షకులంతా ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు.
నక్క ఎంట్రీ.. మ్యాచ్కు తాత్కాలిక విరామం
లండన్ స్పిరిట్ బౌలర్ డేనియల్ వోరాల్ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. మైదానంలో పచ్చటి గడ్డి మీద పరుగులు పెడుతున్న ఆ నక్కను చూసి ఆటగాళ్లు, అంపైర్లు ఆశ్చర్యపోయారు. కొన్ని క్షణాల పాటు మ్యాచ్ నిలిచిపోయింది. ప్రేక్షకులు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. కామెంటరీ బాక్స్లో ఉన్న క్రికెట్ దిగ్గజాలు స్టువర్ట్ బ్రాడ్, ఇయాన్ మోర్గాన్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ నక్క కాసేపు మైదానంలో పరుగులు పెట్టి ఆ తర్వాత ఒక గేటు ద్వారా బయటికి వెళ్లిపోవడంతో ఆట తిరిగి ప్రారంభమైంది.

ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఆధిపత్యం.. ఘన విజయం
ఈ మ్యాచ్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు ఆధిపత్యం కొనసాగింది. మొదట బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్ కేవలం 94 బంతుల్లో 80 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. లండన్ స్పిరిట్ బ్యాటర్లలో టర్నర్ అత్యధికంగా 21 పరుగులు చేశాడు. ఓవల్ ఇన్విన్సిబుల్స్ బౌలర్లు సామ్ కరణ్, రషీద్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి చెరో మూడు వికెట్లు తీసి లండన్ స్పిరిట్ బ్యాటర్లను కట్టడి చేశారు.
విల్ జాక్స్ కీలక ఇన్నింగ్స్
లండన్ స్పిరిట్ నిర్దేశించిన 81 పరుగుల లక్ష్యాన్ని ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు 69 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి సులభంగా ఛేదించింది. ఓపెనర్ విల్ జాక్స్ 24 పరుగులతో అత్యధిక స్కోరర్గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తవాండా 18 పరుగులు చేశాడు. లండన్ స్పిరిట్ బౌలర్లలో లియామ్ డాసన్ 2 వికెట్లు తీసినప్పటికీ అది జట్టు విజయాన్ని సాధించడానికి సరిపోలేదు. ఈ మ్యాచ్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నమెంట్ను ప్రారంభించింది. లార్డ్స్లో మ్యాచ్ సందర్భంగా మైదానంలోకి నక్క దూసుకురావడంతో.. ఈ ఫన్నీ సంఘటన ఒక క్రికెట్ మ్యాచ్లో ఎప్పుడూ గుర్తుండిపోయేలా మారింది.