— Prithvi Shaw (@PrithviShaw) 30 July 2019 |
ట్విట్టర్లో పృథ్వీ షా వివరణ
"ఈ ఏడాది నవంబరు, 2019 మధ్య వరకు నేను క్రికెట్ ఆడలేనని ఈ రోజు నాకు తెలిసింది. నేను తెలియకుండా తీసుకున్న దగ్గు మందులో ఉన్న నిషేధిత ఉత్ప్రేరకం ఫలితమిది. ఫిబ్రవరిలో ఇండోర్ వేదికగా ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా తీవ్రమైన దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతూ ఆ మందు వాడాను. ఆస్ట్రేలియా పర్యటనలో అయిన పాదం గాయం నుంచి కోలుకుని, ఆటలోకి తిరిగొస్తున్న సమయంలో ఇది జరిగింది. త్వరగా ఆటలోకి రావాలనే ఆతృతలో నేను వాడే మందు విషయంలో జాగ్రత్త వహించలేదు. అయితే తీర్పును శిరసావహిస్తాను. నేనాడిన చివరి టోర్నీలోనూ గాయపడ్డాను. దాన్నుంచి కోలుకుంటున్న సమయంలో ఈ వార్త నన్ను కుదిపేసింది. ఈ ఉదంతం మిగతా క్రీడాకారులు చిన్న చిన్న మందులు వాడేటపుడు కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తుందని ఆశిస్తున్నా. ఈ సందర్భంగా నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐకి, సన్నిహితులకు ధన్యవాదాలు. క్రికెట్టే నా జీవితం. భారత్కు, ముంబైకి ఆడటం కంటే పెద్ద గౌరవం మరేదీ లేదు. ఈ పరిణామం నుంచి త్వరగా కోలుకుని, మరింత దృఢంగా తయారై వస్తా" అని ట్వీట్ చేశాడు.
అసలేం జరిగింది?
ఈ ఏడాది ఫిబ్రవరి 22న ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షల్లో పృథ్వీ షా విఫలమయ్యాడు. అతడి మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. ఇది సాధారణంగా దగ్గు మందుల్లో ఉంటుందని పేర్కొన్న బీసీసీఐ.. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల ప్రకారం మ్యాచ్లు ఆడేటపుడు లేదా బయట కూడా దీనిని ఉపయోగించకూడదు.
పృథ్వీ షాకి బీసీసీఐ నోటీసులు
అయితే, జులై 16నే పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే బీసీసీఐ పృథ్వీ షాకి నోటీసులు జారీ చేసింది. దగ్గు మందు వినియోగం వల్లే నిషేధిత ఉత్ప్రేరకం తన ఒంట్లోకి వచ్చిందని పృథ్వీ ఇచ్చిన వివరణతో బీసీసీఐ సంతృప్తి చెందలేదు. దీంతో అతడిపై 8 నెలలు పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం మార్చి 16 నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
నవంబరు 15కే పృథ్వీ షాకి
దీంతో నవంబరు 15కే పృథ్వీ షాకి విధించిన శిక్ష పూర్తి కానుంది. పృథ్వీ షాతో పాటు అక్షయ్ దివాల్కర్, దివ్య గజ్రాజ్ అనే ఇద్దరు దేశవాళీ క్రికెటర్లూ డోపీలుగా తేలారు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన పృథ్వీ షా ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడటంతో ఆ సిరిస్ మొత్తానికి దూరమయ్యాడు.
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో
అయితే, గాయ నుంచి కోలుకుని ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన షా... ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుఫున ఐపీఎల్ ఆడాడు. కాగా, ఇటీవలే తుంటి గాయానికి గురైన పృథ్వీ షా వెస్టిండీస్-ఎతో భారత్-ఎ వన్డే, టీ20 సిరీస్లకు దూరమయ్యాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటూ గాయం నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.