న్యూఢిల్లీ: ప్రస్తుత భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ ఆడే తొలి రోజుల్లో సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్ఇఆర్)లో టికెట్ కలెక్టర్గా పని చేశాడు. ఆశ్చర్యం కలించే విషయమైనా ఇది నిజమే. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఎస్ఇఆర్ క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉండేవాడు. దేశంలోనే అత్యుత్తమ ఐఐటి సంస్థ ఉన్న నగరంగా, అతి పెద్ద ప్లాట్ఫామ్ ఉన్న రైల్వే స్టేషన్గల సిటీగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన ఖరగ్పూర్లో ధోనీ టికెట్ కలెక్టర్గా సేవలు అందించాడు.
'ఎంఎస్డి' - 'ఓ వ్యక్తి- ఓ నాయకుడు' అన్న పేరుతో బిశ్వదీప్ ఘోష్ రచించిన ధోనీ జీవిత చరిత్రలో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. ఆ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే అప్పటి డివిజనల్ రైల్వే మేనేజ్ (డిఆర్ఎం) అనిమేష్ గంగూలీ అప్పట్లో ఖాళీగా ఉన్న ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టిటిఇ) పోస్టును ఒక క్రికెటర్తో భర్తీ చేయాలని అనుకున్నాడు.
అదృష్టం కొద్దీ అదే సమయంలో ధోనీ అతని కంటపడ్డాడు. ఎస్ఇఆర్ జట్టులో సభ్యుడిగా ఉన్న ధోనీ అప్పటికే భారత అండర్-19 జట్టులో ఆడాడు. పైగా టిటిఇ పరీక్ష కూడా పాసయ్యాడు. ధోనీని చూసిన తర్వాత క్షణం ఆలోచించకుండా అతనిని టిటిఇగా నియమించారు గంగూలీ. నిబంధనలను అనుసరించి, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించిన ధోనీ ఎప్పుడూ పొరపాట్లు చేయలేదని, డ్యూటీకి గైర్హాజరు కాలేదని అక్కడి రకార్డులు స్పష్టం చేస్తున్నాయి.

పాన్ సింగ్, దేవకీ దేవీ దంపతులకు జన్మించిన ధోనీ చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్నాడు. ఖరగ్పూర్లో ఉంటూ, ఎస్ఇఆర్ జట్టులో ఆడేవాడు. ఆ ప్రాంతంలో 'ఖెప్' క్రికెట్గా పరిచయమైన టెన్నిస్ బంతితో క్రికెట్ బాగా ఆడేవాడు. ధోనీ ప్రతిభను చూసి వివిధ క్లబ్లు అతనిని తమ జట్టులో ఆడేందుకు ఆహ్వానించేవి. డిమాండ్ పెరగడంతో, ఒక్కో మ్యాచ్కి ధోనీ అప్పట్లోనే 2,000 రూపాయలు వసూలు చేసేవాడు. అయితే, డబ్బు కోసం నిర్వాహకులతో అతను ఎప్పుడు ఘర్షణ పడలేదు.
క్రికెట్ చూసేందుకు మిత్రుడితో ఘర్షణ
టీవీలో వస్తున్న క్రికెట్ మ్యాచ్ని చూసేందుకు ధోనీ ఒకసారి తన రూమ్ మేట్ దీపక్తో తీవ్రంగా ఘర్షణ పడ్డాడు. షార్జా కప్ మ్యాచ్ చూడాలని ధోనీ అనుకుంటే.. అమితాబ్ బచ్చన్ నటించిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాను చూస్తానని దీపక్ పట్టుబట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
చివరికి భీరకమైన ఘర్షణగా మారింది. టీవీ ధ్వంసమైంది. ధోనీకి టిటిఇగా ఉద్యోగం ఇప్పించిన మరో మిత్రుడు సత్యప్రకాష్ కృష్ణ జోక్యం చేసుకొని, ఇద్దరినీ శాంతింప చేశాడు. ఖరగ్పూర్లో సుమారు నాలుగేళ్లున్న ధోనీ ఘర్షణ పడిన సంఘటన అదొక్కటేనట. కాగా, ఘోష్ రాసిన ధోనీ పుస్తకంలో ఇలాంటి ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి.