టీ20 వరల్డ్ కప్ ముగిసి రోజు గడిచినా దేశమంతా క్రికెట్ సందడిలోనే ఉంది. ఎక్కడచూసినా భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్ గురించి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. రోహిత్ సూపర్బ్ కెప్టెన్సీ, ఫైనల్ కోసమే దాచి ఉంచినట్లుగా కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్, హార్దిక్ ఆల్రౌండ్ షో, బుమ్రా, అర్షదీప్ సంచలన బౌలింగ్, సూర్య స్టన్నింగ్ క్యాచ్... ఇలా వరల్డ్ కప్ గురించే సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ నడుస్తోంది.
ఇక టీమిండియా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. గత 11 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ నిరీక్షణ తెరపడటంతో సంతోషంలో మునిగితేలుతున్నారు. ఒక్కటా రెండూ.. ఏకంగా పది ఐసీసీ టోర్నీలను భారత్ చేజార్చుకోవడం, ఆ తర్వాత ఎట్టకేలకు టైటిల్ గెలవడంతో భారాన్ని అంతా దించుకున్నారు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం టీమిండియాకు వరుసగా పరాభవాలే ఎదురయ్యాయి.

2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2021 టీ20 వరల్డ్ కప్లో సూపర్ 12 స్టేజ్, 2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, 2022 టీ20 కప్లో సెమీఫైనల్, 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో.. ఇలా వరుసగా భారత్ ఓటమిపాలై ట్రోఫీలు చేజార్చుకుంది.కానీ 2024లో టీ20 వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేసి కప్ గెలిచింది.
ఈ నేపథ్యంలో ఐసీసీతో పాటు టీమిండియా అభిమానులు గత టోర్నీ జ్ఞాపకాలతో కలిపి ఈ ప్రపంచకప్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి అనంతరం భారత ఆటగాళ్లు కన్నీటితో మైదానాన్ని వీడారు. టోర్నీ ఆద్యంతం సత్తాచాటి ఆఖరి మెట్టుపై బోల్తాపడి కప్ను చేజార్చుకోవడం భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు. ఇక 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్లు ఆనందభాష్ఫాలతో విజయాన్ని ఆస్వాదించారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించిందని ఎమోషనల్ అయ్యారు. కాగా, ఈ రెండు సందర్భాలను పోలుస్తూ ఉన్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.