హైదరాబాద్: ఆసీస్పై 2-1 తేడాతో టెస్టు సిరిస్ను కైవసం చేసుకున్న అనంతరం ఆస్ట్రేలియన్లు ఇకపై తనకు స్నేహితులు కారని తాను చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. ఆసీస్ జట్టులోని కొందరి ఆటగాళ్లను ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేసినట్లు కోహ్లీ స్పష్టం చేశాడు.
ధర్మశాల టెస్టు అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. సిరీస్కు ముందు స్మిత్ అండ్ టీమ్ మైదానం బయట ఫ్రెండ్సే అని చెప్పారు కదా.. ఇప్పటికీ అలాగే భావిస్తున్నారా? అని ప్రశ్నించగా కోహ్లీ స్పందించాడు. 'లేదు అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. నేను వాళ్లను స్నేహితులే అనుకున్నాను. మైదానంలో ఉద్రిక్తత పరిస్థితులు సహజమే అనుకున్నాను కానీ నేను చెప్పింది తప్పు. వాళ్లు నా స్నేహితులని ఎప్పటికీ చెప్పను' అని కోహ్లీ అన్నాడు.
తాను చేసిన వ్యాఖ్యలు ఆసీస్ జట్టులోని అందరినీ ఉద్దేశించి చేసినవి కాదని, కొందరిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే చేసినట్లు ట్విటర్లో కోహ్లీ పోస్టు చేశాడు. కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నట్లు తెలియడంతో స్పందించాల్సి వచ్చిందని కోహ్లీ అందులో పేర్కొన్నాడు.
తనకు కొంతమంది మాత్రమే ఆసీస్ క్రికెట్ జట్టులో స్నేహితులున్నారని చెప్పడమే తన వ్యాఖ్యల వెనుక ఉద్దేశమని కోహ్లీ తెలిపాడు. ఇప్పటికీ పలువురు ఆసీస్ ఆటగాళ్లకు తనకు మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతాయని కోహ్లీ వివరించాడు.
ఐపీఎల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని ఆసీస్ ఆటగాళ్లతో మంచి సంబంధాలే ఉన్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్దం చేసుకున్నారంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.