Test Cricket: ప్రస్తుత కాలంలో టెస్ట్ క్రికెట్ పట్ల క్రేజ్ తగ్గిపోతోంది. ఈ ఫార్మాట్ను ప్రోత్సహించడానికి అందరూ కొత్త వ్యూహాలను అవలంభిస్తున్నారు. అందుకే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్కు ప్రైజ్ మనీని రెట్టింపు కంటే ఎక్కువ చేసింది. ఇంతలో ఓ క్రికెట్ బోర్డు టెస్ట్ మ్యాచ్ల సమయంలో పిల్లలకు ప్రవేశాన్ని ఉచితంగా కల్పించింది. ఈ కీలక నిర్ణయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తీసుకుంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ సందర్భంగా స్టేడియంలోకి పిల్లలకు ప్రవేశం ఉచితం అని క్రికెట్ వెస్టిండీస్(CWI) వెల్లడించింది.
వచ్చే నెలలో ప్రారంభమయ్యే 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ను చూడటానికి కరేబియన్లోని పిల్లలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. క్రికెట్ వెస్టిండీస్(CWI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) క్రిస్ డెహ్రింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్, గ్రెనడాలోని గ్రెనడా నేషనల్ స్టేడియం, జమైకాలోని సబీనా పార్క్లలో జరగనున్న టెస్ట్ మ్యాచ్లకు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.

కెన్సింగ్టన్ ఓవల్లో 'వెస్టిండీస్ హోమ్-ఫుల్ ఆఫ్ ఎనర్జీ' ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించిన సందర్భంగా డెహ్రింగ్ మాట్లాడుతూ.. క్రికెట్ వెస్టిండీస్ కొత్త విధానంలో భాగంగా ఈ చొరవ ప్రారంభించబడిందని అన్నారు. ప్రతి బిడ్డకు టెస్ట్ క్రికెట్ ఆడటం అనేది మానవ హక్కు అని క్రికెట్ వెస్టిండీస్ తాము నమ్ముతున్నామన్నారు. కరేబియన్లో టెస్ట్ క్రికెట్ ఆడటం అనేది మానవ హక్కు అని.. అందుకే ఆ సంవత్సరం మొదటిసారిగా పిల్లలందరూ టెస్ట్ మ్యాచ్లను ఉచితంగా చూడగలిగే విధానానని రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. మీకు టికెట్ అవసరం లేదని.. అది మీ హక్కు అంటూ డెహ్రింగ్ పేర్కొన్నారు. అయితే ఎంత వయస్సు వరకు పిల్లలకు ఉచిత ప్రవేశం లభిస్తుందో ఇంకా తెలియరాలేదు.