భారత్ మరో సమరానికి సిద్ధమైంది. రేపటి నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ ఆడనుంది. జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు భారత్ తలపడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే. అయితే అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం స్వదేశంలో ఇంగ్లాండ్తో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. టెస్టు ఛాంపియన్ షిప్లో టాప్-2లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే టీమిండియాకు ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్ ఎంతో కీలకం.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు ఆడనుంది. అయితే విద్యార్థులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) శుభవార్త తెలిపింది. తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజనం కూడా అందిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఈ మ్యాచ్కు రావొచ్చని వెల్లడించింది.

అయితే దీని కోసం పాఠశాలల ప్రిన్సిపాల్స్ తమ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు, సిబ్బంది వస్తున్నారో ముందుగా తెలియజేయాలి. జనవరి 18వ తేదీలోపు హెచ్సీఏ సీఈవోకు [email protected] కు మెయిల్ చేయాలి. అయిదు రోజుల పాటు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజన సదుపాయం ఉంటుంది.
కాగా, ఉప్పల్లో 2018లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ జరిగింది. వెస్టిండీస్తో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో తెలుగు రాష్ట్రాలకు బీసీసీఐ మొండిచేయి చూపించిన సంగతి తెలిసిందే. భారత్ మ్యాచ్లు ఒకటి కూడా మన దగ్గర నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్లో రెండు టెస్టులకు తెలుగు రాష్ట్రాలే ఆతిథ్యం ఇచ్చేలా బీసీసీఐ చర్యలు తీసుకుంది.
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు విశాఖపట్నం వేదికగా జరగనుంది. చివరి మూడు టెస్టులకు వరుసగా రాజ్కోట్, రాంచీ, ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జనవరి 25న ప్రారంభమయ్యే ఈ అయిదు టెస్టుల సిరీస్ మార్చి 11వరకు సాగుతుంది. ఆ తర్వాత ఐపీఎల్ ప్రారంభమవుతుంది. అనంతరం టీమిండియా జూన్లో టీ20 ప్రపంచకప్ ఆడనుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా పొట్టి వరల్ట్ కప్నకు ఆతిథ్యం ఇస్తున్నవిషయం తెలిసిందే.