న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్టు పగ్గాలను వదిలేసిన విలియమ్సన్ వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా గుడ్బై చెప్పాడు. ఇకపై వన్డేల్లో, టీ20ల్లోనూ సారథిగా ఉండనని ప్రకటించాడు. అంతేగాక 2024-25కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ను తిరస్కరించనున్నట్లు తెలిపాడు. వేసవిలో ఫ్రాంచైజీ లీగ్లకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుండటంతో కాంట్రాక్ట్ను వద్దనుకున్నట్లు పేర్కొన్నాడు.
మరోవైపు టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ ఘోర వైఫల్యం కూడా కేన్ విలియమ్సన్ నిర్ణయానికి ఓ కారణమని వార్తలు వస్తున్నాయి. పొట్టి కప్ చరిత్రలో తొలిసారిగా కివీస్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. దాదాపు దశాబ్దం తర్వాత సెమీఫైనల్స్కు చేరలేదు. ఈ మెగాటోర్నీలో గ్రూప్-సీలో ఉన్న బ్లాక్క్యాప్స్ తమ తొలి మ్యాచ్లో అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ చేతిలో ఘోర పరాజయాల్ని చవిచూశారు. ఆ తర్వాత ఉగాండ, పపువా న్యూ గినియాపై ఓదార్పు విజయాలు సాధించింది.

అయితే కేన్ విలియమ్సన్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అసంతృప్తి వ్యక్యం చేశాడు. నేషనల్ డ్యూటీ కంటే ఫ్రాంచైజీ లీగ్పై మక్కువతో కేన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అన్నాడు. సమ్మర్లో జాతీయ జట్టుకు అందుబాటులో ఉండకూడదనే ఇలా చేశాడని తెలిపాడు. ఈ విషయంపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు లోతుగా ఆలోచించాలని సూచించాడు.
బౌల్ట్, సౌథీ తమ కెరీర్ ముగింపుకు వచ్చారని, మరోవైపు లాకీ ఫెర్గూసన్ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ను వదులుకున్నాడని, ఈ నిర్ణయాలు న్యూజిలాండ్ ద్వైపాక్షిక సిరీస్లపై ప్రభావం చూపుతాయని అన్నాడు. ఈ ప్లేయర్లు పాల్గొంటూ ద్వైపాక్షిక సిరీస్లను పోటీలో ఉంచాలని హర్భా భోగ్గే పేర్కొన్నాడు. జనవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా లీగ్లు ప్రారంభమవుతాయనే విషయం తెలిసిందే.
దుబాయ్ వేదికగా ఐఎల్టీ20, సౌతాఫ్రికాలో ఎస్ఏ20, ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్, బంగ్లాదేశ్ బీపీఎల్, అలాగే న్యూజిలాండ్లో సూపర్ స్మాష్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ జరుగుతాయి. మార్చిలో ఐపీఎల్ మొదలవుతుంది. ఈ లీగుల్లో పాల్గొనడం కోసమే న్యూజిలాండ్ క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్టును వదులుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.