జోహన్నెస్ బర్గ్ : మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజమేనని తేలడంతో.. నలుగురు ఆటగాళ్లపై నిషేధం విధించింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ). సుదీర్ఘ విచారణ అనంతరం ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల పాటు సదరు క్రికెటర్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
2015లో జరిగిన రామ్ స్లామ్ టీ20 మ్యాచుల్లో ఫిక్సింగ్ కు పాల్పడ్డందుకు గానీ ఈ నిషేధం విధించింది సీఎస్ఏ. నిషేధం విధించిన ఆటగాళ్లలో.. థామి సొలెకిలే, సీమ్ సైమ్స్, ఎథీ ఎంబలాటీ, పుమేలేలా ఉన్నారు. ఇందులో థామి సొలెకిలే అంతర్జాతీయ మాజీ క్రికెటర్ కాగా, 2004లో ఇంగ్లాండ్ తో ఆడిన మూడు టెస్టులు అతని అంతర్జాతీయ కెరీర్ లో చివరివి.
థామి సొలెకిలే మినహా మిగతా ఆటగాళ్లంతా యువ క్రికెటర్లే కాగా.. మరో ఇద్దరిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. సొలెకిలేపై 12 ఏళ్లు, సైమ్స్ పై ఏడేళ్లు, ఎంబలాటీ, పుమేలేలాపై పదేళ్లు నిషేధం విధించింది సీఎస్ఏ.