
బెంగళూరు: టీమిండియా మాజీ క్రికెటర్ బీఎస్ చంద్రశేఖర్ ఆసుపత్రిలో చేరారు. అస్వస్థతతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. జనవరి 15న 75 ఏళ్ల చంద్రశేఖర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అలసట మరియు మాట సరిగా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
బీఎస్ చంద్రశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ వెల్లడించారు. 'అస్వస్థతతో మాజీ క్రికెటర్ బీఎస్ చంద్రశేఖర్ బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ ఆరోగ్యం స్థిరంగా ఉంది' అని మృత్యుంజయ తెలిపారు.
టీవీలో మ్యాచ్ చూస్తుండగా అకస్మాత్తుగా ఆయాసం రావడం, మాట తడబడటంతో వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్టు బీఎస్ చంద్రశేఖర్ భార్య సంధ్య ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, రెండు రోజుల్లో తిరిగి ఇంటికి వస్తారని ఓ జాతీయ మీడియాతో ఆమె స్పష్టం చేశారు. చంద్రశేఖర్ ఆరోగ్యంపై అతని సహచర క్రికెటర్లు ఫోన్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు.
లెజెండ్రీ లెగ్ స్పినర్ బీఎస్ చంద్రశేఖర్ భారత్ తరఫున 58 టెస్ట్ మ్యాచ్లు ఆడి 242 వికెట్లు పడగొట్టారు. 8/79 అత్యుత్తమ గణాంకాలు. 16 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. యావరేజ్ రన్ రేటు 29.74 శాతంగా ఉంది. 1961 జనవరిలో ఆయన క్రెకెట్ టీమ్లోకి అడుగుపెట్టి 1979లో చివరి మ్యాచ్ ఆడారు. న్యూజిలాండ్తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడారు. ఆ మ్యాచ్లో 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు.