
'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లేదు:
భారత్ తరఫున 2006లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన ఎంఎస్ ధోనీ.. ఇప్పటి వరకూ 98 మ్యాచ్లు ఆడాడు. 98 మ్యాచ్లలో మహీ ఒక్క 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెలవలేదు. క్రికెట్ చరిత్రలో 71కి పైగా టీ20లు ఆడినా.. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెలవని ఏకైక క్రికెటర్ ధోనీనే. అంతర్జాతీయ క్రికెట్లో 98 టీ20 మ్యాచ్లాడిన ధోనీ.. 37.6 సగటుతో 1617 పరుగులు చేశాడు. ఇందులో 116 ఫోర్లు, 52 సిక్సర్లు ఉండగా.. కేవలం రెండు హాఫ్ సెంచరీలను మాత్రమే చేశాడు.

ధోనీ@1:
అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెలవని జాబితాలో ఎంఎస్ ధోనీతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. దినేశ్ రామ్దిన్ (71 మ్యాచ్లు), అస్గర్ అఫ్గాన్ (69), విలియమ్ పోర్టర్ఫీల్డ్ (61), దినేశ్ చండిమాల్ (54) ధోనీ తర్వాత టాప్-5లో కొనసాగుతున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవకుండా ఎక్కువ టీ20 మ్యాచ్లు ఆడింది మాత్రం మన 38 ఏళ్ల మహీనే. టీ20ల్లో ఎక్కువగా స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్ చేసే ధోనీకి తక్కువ బంతులు ఆడే అవకాశం వస్తుంటుంది. దీంతోనే మహీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచే అవకాశం రాలేదు.

ప్రపంచకప్ తర్వాత దూరం:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. కనీసం దేశవాళీ టోర్నీల్లోనూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాదాపు 6 నెలలు జట్టుకు దూరమవడంతో బీసీసీఐ అతడికి సెంట్రల్ కాంట్రాక్టు ఇవ్వలేదు. దీంతో మహీ రిటైర్మెంట్ ప్రకటించాలని కొందరు మాజీల నుండి ఒత్తిడి ఎక్కువైంది. ఐపీఎల్-2020లో ఫామ్ నిరూపించుకుని.. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని చూస్తున్నాడు.

ఐపీఎల్-13 నిరవధిక వాయిదా:
ఇక ఐపీఎల్ 2020 సీజన్లో ఆడి ఫామ్ నిరూపించుకోవడం ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఎంఎస్ ధోనీ ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఐపీఎల్-13 నిరవధికంగా వాయిదా పడిపోయింది. దీంతో టీ20 ప్రపంచకప్లో ధోనీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే కొందరు మాజీలు మహీ మెగా టోర్నీ ఆడాలని సూచిస్తుండగా.. మరికొందరు ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications
