హైదరాబాద్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానుంది. అబుదాబి, దుబాయ్, షార్జా వేదికల్లో 53 రోజుల పాటు 60 మ్యాచ్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షెడ్యూల్ చేసింది. లీగ్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి మైదానాల్లోకి వెళ్లి మ్యాచ్లు చూసే అవకాశం లేదు. టీవీలకు అతుక్కుపోవాల్సిందే. దీంతో ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ భారీగా ప్లాన్ చేసింది.
స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళంలో కామెంట్రీ చెప్పే వ్యాఖ్యాతల జాబితాని తాజాగా విడుదల చేసింది. దిగ్గజ క్రికెటర్ల వ్యాఖ్యాతల బృందం ఐపీఎల్లో అభిమానుల్ని ఉర్రూతలూగించనుంది. తెలుగు కామెంటేటర్ జాబితాలో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చోటు దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెస్కే.. తన వ్యాఖ్యానంతో తెలుగు అభిమానులను అలరించనున్నాడు. మరో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిస్ శ్రీకాంత్ కూడా తమిళంలో కామెంట్రీ చెప్పుబోతున్నాడు. ఎమ్మెస్కే భారత్ తరఫున 6 టెస్టులు, 17 వన్డేలు ఆడాడు.
ఐపీఎల్ 2020కి తెలుగులో కామెంట్రీ చెప్పే జాబితాలో ఎమ్మెస్కే ప్రసాద్ సహా మరో ఏడుగురు కూడా ఉన్నారు. ఎం ఆనంద్ శ్రీ కృష్ణ, ఎం నేహా, కౌశిక్ నలన్ చక్రవర్తి, ఎం ఆశిష్ రెడ్డి, వెంకటపతి రాజు, వై వేణుగోపాలరావు, ఎమ్మెస్కే ప్రసాద్, డి కళ్యాణ్ కృష్ణలు తెలుగులో కామెంట్రీ చెప్పనున్నారు. ఇక బీసీసీఐ కామెంట్రీ ఫ్యానల్ నుంచి వేటుకి గురైన సంజయ్ మంజ్రేకర్కి షాక్ తగిలింది. స్టార్ స్పోర్ట్స్ అతనికి అవకాశం ఇవ్వలేదు.
సునీల్ గావస్కర్, హర్ష భోగ్లే, ఎల్ శివరామకృష్ణన్, మురళీ కార్తీక్, దీప్ దాస్గుప్తా, రోహన్ గవాస్కర్, అంజుమ్ చోప్రా వంటి భారత అగ్రశ్రేణి కామెంటేటర్లు కూడా వ్యాఖ్యానం చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్లు జరగనుండటంతో టీవీ వ్యూవర్షిప్ ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉందని స్టార్ స్పోర్ట్స్ అంచనా వేస్తోంది. ఈసారి అరగంట ముందే మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి. రాత్రి 8 గంటలకి ప్రారంభమయ్యే మ్యాచ్లు 7.30కి స్టార్ట్ కానుండగా.. మధ్యాహ్నం మ్యాచ్లు 4 గంటలకి కాకుండా 3.30కే ప్రారంభంకానున్నాయి.
Chennai Super Kings: నా క్లాస్లో ఈల వేసింది ఎవరు.. ఎంఎస్ ధోనీకి బుక్కైన కేదార్ జాదవ్!!