
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో దారుణంగా ఫెయిలైన బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లోనూ అతను తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అంతేకాదు, రెండు మ్యాచుల్లో దాదాపు ఒకే మాదిరి అవుటయ్యాడు. టీ20ల్లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్గా ఉన్న అతను.. ఇలా వన్డేల్లో ఘోరంగా ఎందుకు ఫెయిలవుతున్నాడో అర్థం కావడం లేదని, అతని ఫామ్ పెద్ద మిస్టరీలా మారిందని మాజీ సెలెక్టర్ సాబా కరీం అంటున్నాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ వచ్చే వరకు రోహిత్ శర్మ మాత్రం సూర్యనే ఆడించే అవకాశం ఉందన్నాడు.
'శ్రేయాస్ అయ్యర్ లేకపోతే అతని స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్తో భర్తీ చేయాలని టీం మేనేజ్మెంట్ అనుకుంటోంది. అయ్యర్ తిరిగొస్తే వరల్డ్ కప్లో కూడా అతనే నెంబర్ 4 బ్యాటర్. ఎందుకంటే అతను అంత బాగా రాణించాడు. ప్రస్తుతం సూర్య ఒక మిస్టరీలా ఉన్నాడు. టీ20ల్లో అతనో టాప్ బ్యాటర్. అలాంటి వాడు వన్డేల్లో పరుగులు ఎందుకు చేయలేకపోతున్నాడో తెలియడం లేదు. అందుకే అతనికి రోహిత్ మరిన్ని ఛాన్సులు ఇవ్వాలని అనుకుంటున్నాడు' అని సాబా కరీం వివరించాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ను సరిగా అంచనా వేయలేక రెండు వన్డేల్లో సూర్య గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే.
శ్రేయాస్ గాయాలపాలైన సమయంలో సూర్య ఫెయిలవుతున్న నేపథ్యంలో భారత జట్టు నాలుగో నెంబర్లో బ్యాటింగ్ చేయడానికి మరికొన్ని ఆప్షన్లు పెట్టుకోవడం మంచిదని సాబా కరీం అభిప్రాయపడ్డాడు. సర్ఫరాజ్ అహ్మద్, రజత్ పటీదార్లలో ఒకరిని ఆడించొచ్చని, కానీ వీళ్లిద్దరూ గాయాలతో ఉన్నారని గుర్తుచేశాడు. అలాగే సంజూ శాంసన్కు కూడా ఈ ఛాన్స్ ఇవ్వొచ్చన్న అతను.. 'ఇలా మరికొన్ని ఆప్షన్లు ఉంచుకోవడం బెటర్. కానీ సంజూ ఫిట్గా ఉన్నాడో లేదో తెలియదు' అని పేర్కొన్నాడు.