రోహిత్ శర్మ సారధ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన టీమిండియా చిత్తుగా ఓడింది. దానికితోడు రోహిత్ వయసు ఇప్పుడు 36. మరో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే సరికి రోహిత్కు 38 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. ఈ క్రమంలో అతని స్థానంలో జట్టు పగ్గాలు ఎవరికి అందించాలనే చర్చ భారత క్రికెట్లో ముమ్మరంగా జరుగుతోంది.
ఈ సందర్భంగా భారత యువ సంచలనం శుభ్మన్ గిల్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించిన అతను మూడు ఫార్మాట్లలో సెంచరీలతో చెలరేగాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా బాదాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కూడా ఏకంగా 890 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని కెప్టెన్ చేయాలని కొందరు మాజీలు సూచించారు.

అయితే ఈ నిర్ణయం సరైంది కాదని భారత మాజీ సెలెక్టర్ భూపీందర్ సింగ్ అంటున్నాడు. భారత జట్టు సెలెక్టర్గా 2005 నుంచి 2008 వరకు సేవలందించిన అతను.. ఇటీవలే ధోనీకి కెప్టెన్సీ ఇవ్వడంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా గిల్ను కెప్టెన్ చేయడం గురించి మాట్లాడిన ఆయన.. కెప్టెన్సీ విషయంలో గిల్ ఇంకా సిద్ధంగా లేడని తేల్చిచెప్పాడు.
'నేనైతే ఇలాంటి కీలక సమయంలో అతన్ని తొందరపెట్టను. భారత్లో తదుపరి బ్యాటింగ్ సెన్సేషన్ అయ్యే సత్తా గిల్కు ఉంది. అది కచ్చితంగా జరుగుతుందని నా నమ్మకం కూడా. ఆ బ్యాటింగ్ నైపుణ్యం, వ్యక్తిత్వం గిల్కు ఉన్నాయి. ఈ క్రమంలో నెమ్మదిగా మంచి కెప్టెన్గా కూడా అతను ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి' అని భూపీందర్ సింగ్ చెప్పాడు.
ప్రస్తుతం గిల్ ఫోకస్ అంతా జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవడంపై ఉండాలని సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత కావాలంటే అతనికి జట్టు బాధ్యతలు అప్పగించవచ్చని చెప్పాడు. 'అన్నీ ఒక పద్ధతిలో జరగాలి కదా. అతన్ని ఏ ఫార్మాట్కు ఎంపిక చేస్తున్నారో.. ఆ ఫార్మాట్లో తన స్థానం సుస్థిరం చేసుకోవడంపై గిల్ ఫోకస్ పెట్టాలి' అని చెప్పాడు.
అలాగే ఒక జట్టులో కెప్టెన్ అయిన వ్యక్తి ఎవరికీ భారం కాకూడదని, తన భారం తనే మోసుకోవాలని కూడా సింగ్ అన్నాడు. ఇక గిల్ గురించి ఇదే విషయం చెప్పిన అతను.. 'కనీసం ఇంకో రెండు, మూడేళ్లు అతను జట్టుకు భారం కాడు. జట్టులో కెప్టెన్ తన భారం తనే మోసుకోవాల్సి ఉంటుంది' అని వెల్లడించాడు. మరి బీసీసీఐ ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.