డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోరమైన ప్రదర్శనతో టీమిండియా విమర్శలపాలైంది. ఈ క్రమంలోనే వచ్చే డబ్ల్యూటీసీ సైకిల్ కోసం ఇప్పటి నుంచే జట్టును బిల్డ్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే విండీస్ టూర్లో గైక్వాడ్, జైస్వాల్ వంటి కుర్రాళ్లను ఎంపిక చేసింది. అదే సమయంలో జట్టు వైస్ కెప్టెన్గా అజింక్య రహానేను నియమించింది. దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కుర్రాళ్లతో జట్టును నిర్మించాలంటే రోహిత్ డిప్యూటీగా కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలి కానీ.. రహానేకు కెప్టెన్సీ ఇచ్చి ఏం చేస్తారని అడిగారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా.. ఈ ముగ్గుర్నీ లీడర్ షిప్ గ్రూప్గా భావిస్తున్నామని, రోహిత్ తర్వాత వీరిలో ఒకరే కెప్టెన్ అవుతారని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. ఈ క్రమంలో మాజీ సెలెక్టర్ సాబా కరీం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

'కెప్టెన్సీ విషయంలో రవీంద్ర జడేజా గురించి ఎవరూ కనీసం మాట్లాడటం లేదు. అదే నాకు ఆశ్చర్యం. తను అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ప్లేయర్. టెస్టు విజయాల్లో కూడా కీలక పాత్ర పోషించాడు. అలాంటి వాడిని కెప్టెన్సీ విషయంలో కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మూడు ఫార్మాట్లలో అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. జాతీయ జట్టుకు నాయకత్వం వహించే సత్తా కూడా అతనికి ఉంది' అని కరీం అన్నాడు.
'లేదు.. మేం భవిష్యత్తుపై ఫోకస్ పెట్టామని సెలెక్టర్లు అంటే శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్ చేయాలి. అతనొక్కడే కాదు. ఇలా మరికొంత మంది క్యాండిడేట్లు ఉన్నారు. వారందర్నీ కాదని.. కుర్రాళ్లకు జట్టులో చోటు కల్పించిన సెలెక్టర్లు రహానేను వైస్ కెప్టెన్ ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ల లాజిక్ ఏంటో? జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఒక్క మ్యాచ్ బాగా ఆడగానే ఇదేం నిర్ణయం?' అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
'నేను రహానేను కించపరచడం లేదు. అతను చాలా మంచి క్రికెటర్. కానీ కుర్రాళ్లను లీడర్లుగా మార్చాలి అనుకునేటప్పుడు.. రహానేకు ఎందుకు లీడర్షిప్ ఇచ్చారు? నిజంగా జట్టు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే.. కుర్రాడికి ఈ అవకాశం ఇచ్చి, అతన్ని ఫ్యూచర్ కెప్టెన్గా మార్చేందుకు ప్రయత్నించాలి కదా' అని ప్రశ్నించాడు.