అరంగేట్రానికి సిద్ధమైన కేఎస్ భరత్
ఇప్పటికే తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ టీమిండియా టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు అరంగేట్రం చేయలేదు కానీ.. సాహాను పక్కన పెట్టినప్పటి నుంచి భరత్ జట్టుతోనే ఉన్నాడు. పంత్కు టెస్టుల్లో సరైన బ్యాకప్ అతనే అని రాహుల్ ద్రావిడ్ కూడా చెప్పాడు. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ సమయానికి పంత్ కోలుకోకపోతే.. కేఎస్ భరత్ అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతకుముందు ఇంగ్లండ్లో ప్రాక్టీస్ మ్యాచులో కూడా భరత్ రాణించాడు. కానీ తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు.
భరత్ వద్దు.. కిషన్ ముద్దు..
అయితే ఆస్ట్రేలియా సిరీస్లో కేఎస్ భరత్ కన్నా ఇషాన్ కిషన్కు అవకాశం ఇస్తే మంచిదని మాజీ సెలెక్టర్ సాబా కరీమ్ అంటున్నాడు. భరత్ మంచి ఆటగాడే కానీ.. పంత్ స్థానాన్ని సరిగ్గా భర్తీ చేయాలంటే ఇషాన్ కిషన్ వల్లే అవుతుందని ఆయన స్పష్టం చేశాడు. 'టెస్టుల్లో కీపింగ్ పాత్ర కోసం కేఎస్ భరత్ను సానబెడుతున్నారని నాకు తెలుసు. అది మంచిది కూడా. కానీ పంత్ స్థానాన్ని భర్తీ చేయాలంటే మాత్రం ఇషాన్ కిషన్ వల్లనే కుదురుతుందని నా నమ్మకం. టెస్టు జట్టులో పంత్ పాత్ర చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కిషన్ కూడా రంజీల్లో అలాగే దూకుడుగా ఆడుతున్నాడు కదా' అని వివరించాడు.
దేశవాళీల్లో రాణిస్తున్న కిషన్..
పంత్ బాగా ఆడటం వల్ల మనం టెస్టు మ్యాచులు గెలవలేదన్న సాబా కరీమ్.. అతను వేగంగా పరుగులు చేయడం వల్ల విజయాలు సాధించామని చెప్పాడు. ఇలా చేయడం వల్ల ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. అదే సమయంలో మన బౌలర్లకు 20 వికెట్లు తీసుకునే సమయం కూడా దొరుకుతుందని వివరించాడు. అదే సమయంలో ఇండియా ఎ తరఫున కూడా ఇషాన్ కిషన్ ఎలాంటి టెస్టు క్రికెట్ ఆడలేదనే విషయాన్ని కూడా సాబా కరీమ్ గుర్తుచేశాడు. కానీ కొంతకాలంగా అతను దేశవాళీల్లో రాణిస్తున్నాడని చెప్పాడు.