
హైదరాబాద్: 2015 దేశవాళీ క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణానికి పాల్పడిన కేసులో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గులామ్ బోడీకి అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఫలితంగా హాన్సీ క్రోన్జే మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత అమలులోకి వచ్చిన అవినీతి చర్యల నివారణ, పోరాట చట్టం 2004 కింద జైలు శిక్ష అనుభవిస్తున్న తొలి దక్షిణాఫ్రికా క్రీడాకారుడిగా బోడి నిలిచాడు.
గులామ్ బోడీ దక్షిణాఫ్రికా తరుపున రెండు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్ ఆడాడు. జైలు శిక్ష విధించడానికి ముందే బోడీ తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. 2015 రామ్స్లామ్ టీ20 దేశీయ టోర్నీని ప్రభావితం చేసినందుకు గాను బోడిని క్రికెట్ దక్షిణాఫ్రికా 20 సంవత్సరాలు నిషేధించింది.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత బోడీ కామెంటేటర్గా విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో రాడి స్లామ్ టీ20 దేశీయ టోర్నమెంట్లో మ్యాచ్ ఫలితాలను మార్చేందుకు గాను దేశీయ ఆటగాళ్లతో పాటు మాజీ జట్టు సభ్యులకు డబ్బు ఇవ్వడం ప్రారంభించాడు.
గతేడాది జూలైలో తనంతట తానుగా పోలీసులకు లొంగిపోయిన గులామ్ బోడీ నవంబర్ 4, 2018 న నేరాన్ని అంగీకరించాడు. గులామ్ బోడీ స్ఫాట్ ఫిక్సింగ్ కుంభకోణాన్ని బయటపెట్టిన ఆటగాళ్లలో ఒకడైన అల్విరో పీటర్సన్ శుక్రవారం విచారణకు సైతం హాజరయ్యాడు. బోడీకి శిక్ష పడిన తర్వాత పీటర్సన్ ట్వీట్ కూడా చేశాడు.