
సీనియర్లు లేకుండా న్యూజిల్యాండ్ వెళ్లిన టీమిండియా.. వన్డే సిరీస్ ఓటమితో భారంగా బంగ్లాదేశ్ చేరుకుంది. ఇక్కడ సీనియర్లతో కలిసి బంగ్లా టైగర్స్తో వన్డే సిరీస్కు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ దిగ్గజం సాబా కరీమ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో ఇద్దరు ఆటగాళ్లు ఈ సిరీస్లో రాణించక తప్పని పరిస్థితి ఉందన్నాడు. వాళ్లు రాణించకపోతే జట్టులో స్థానం ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించాడు.
టీ20 వరల్డ్ కప్లో విఫలమైన రోహిత్ శర్మకు బంగ్లా టూర్ ఒక ఛాన్స్ కానుంది. పొట్టి ప్రపంచకప్లో ఆరు ఇన్నింగ్స్లు ఆడిన అతను కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. వీటిలో నెదర్లాండ్స్పై చేసిన హాఫ్ సెంచరీ కూడా ఉంది. పసికూనపై అతని ఈ ఇన్నింగ్స్ కూడా సాఫీగా సాగలేదు. తడబడుతూనే ముందుకు వెళ్లింది. ఆ తర్వాత కివీస్ పర్యటన సమయంలో రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడు. ''రోహిత్ శర్మ ముందుండే అతిపెద్ద సవాల్ బ్యాటింగ్. మంచి ప్రదర్శన చేస్తే కెప్టెన్సీ దానికదే మెరుగవుతుంది. ముందు పరుగులు చేయాలి'' అని సాబా కరీం చెప్పాడు.

ఇక రాడార్లో ఉండే మరో బ్యాటర్ రిషభ్ పంత్. పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత చెత్త ఫామ్లో ఉన్న పంత్.. బంగ్లాపై అయినా రాణించి జట్టులో తన స్థానం పదిలం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి వాళ్లు రేసులో ఉండగా.. పంత్ రాణించకుంటే జట్టులో కొనసాగడం కష్టంగా మారింది.
అయితే అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తానన్న సాబా కరీమ్.. ''నేనైతే పంత్నే ఆడిస్తాను. బంగ్లాదేశ్లో మూడు మ్యాచుల్లోనూ అతను ఆడాలి. బ్యాటింగ్ పొజిషన్ ఫిక్స్ చేసి, ఐదో స్థానంలో అతన్ని ఆడించాలి. అతను రాణించకపోతే వేరే ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టాలి. ఇషాన్ కిషన్ లేదా సంజూ శాంసన్ ఎవరికైనా అవకాశం ఇవ్వొచ్చు'' అని పేర్కొన్నాడు.