
రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ల వైఫల్యం అందరికీ ఆగ్రహం తెప్పించింది. కొత్త కుర్రాళ్లు ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇషాన్ కిషన్ గత 12 ఇన్నింగ్సుల్లో పెద్దగా పరుగులు చేసింది లేదు. అదే సమయంలో ఈ ఏడాదిలోనే టీ20 అరంగేట్రం చేసిన శుభ్మన్ గిల్ కూడా ఏమాత్రం రాణించడం లేదు. అతను కొద్దిగా ఆడింది లంకతో ఆడిన చివరి టీ20లో. దానిలో కూడా చాలా నిదానంగా ఆడాడు.
ఈ క్రమంలో కివీస్తో టీ20 మ్యాచ్లో భారత టాపార్డర్ వైఫల్యాన్ని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా పెదవి విరిచాడు. 'టీమిండియాది మిస్ ఫైర్ అవుతున్న టాపార్డర్. జట్టు ఆరంభమే బాగోడం లేదు. బంతి కిషన్ స్టంప్స్ను పడగొట్టింది. అతని చివరి 12 ఇన్నింగ్సుల్లో అత్యధిక స్కోరు 36 మాత్రమే. ఇక గిల్.. స్టక్ అయిన బంతిని ఆడలేక క్యాచ్ అవుటయ్యాడు. టీ20ల్లో గిల్ కథ ప్రస్తుతానికి ఏం బాగలేదు' అని ఆకాష్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇక రాహుల్ త్రిపాఠీ కూడా ఫెయిలవడంపై కూడా అతను స్పందించాడు. 'రాహుల్ త్రిపాఠీ కెరీర్ చాలా చిన్నది. ఇప్పుడే మొదలైన విషయం కరెక్టే కానీ.. ఈ మ్యాచ్లో కనీసం ఖాతా తెరవలేకపోయాడు. ఆ తర్వాత ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వచ్చారు. సూర్యపైనే జట్టు విజయావకాశాలు పూర్తిగా ఆధారపడ్డాయి. కవర్స్ మీదుగా సూర్య అద్భుతమైన సిక్సర్ బాదాడు. కానీ ఆ తర్వాతి బంతికే అవుట్ అయిపోయాడు. అదే ఈ మ్యాచ్లో గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అని నా అభిప్రాయం. హార్దిక్ పాండ్యా అప్పటికే నిదానంగా ఆడినా.. కాసేపటికే అవుటైపోయాడు' అని వివరించాడు.