|
అందరి ఆశీర్వాదాల వల్లే:
పాప పుట్టడంతో షాహిద్ అఫ్రిది కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. తాను తండ్రయిన విషయాన్ని అఫ్రిదినే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పాపను ఎత్తుకున్న ఫొటోను పోస్ట్ చేసి తన సంతోషాన్ని ఫ్యాన్స్తో పంచుకున్నారు. 'నాపై సర్వశక్తిమంతుడి అనంతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అందరు చూపుతున్న దీవెనలతో ఇప్పటికే నలుగురు కుమార్తెలు చల్లగా ఉన్నారు. ఇప్పుడు ఐదో కుమార్తె పుట్టడంతో నలుగురు ఐదుగురయ్యారు. ఈ శుభవార్తను సన్నిహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులతో పంచుకుంటున్నా' అని అఫ్రిది ట్వీట్ చేశారు.
పెంపకం విషయంలో ఆంక్షలు:
అఫ్రిది తన పిల్లల పెంపకం విషయంలో ఆంక్షలు పెడుతూ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆడపిల్లలు క్రికెట్ లేదా అవుట్డోర్ గేమ్స్ ఆడటం తమ సంప్రదాయాలకి విరుద్ధమని.. తన పిల్లల్ని ఆ గేమ్స్ ఆడేందుకు అనుమతించట్లేదని అఫ్రిది గతంలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక తన కూతురు టీవీలో హారతి ఇచ్చే సన్నివేశం చూసి.. దాన్ని అనుకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి విమర్శలపాలయ్యాడు.
నెట్టింట్లో సెటైర్లు:
ఐదో బిడ్డకు తండ్రి అయిన అఫ్రిదికి పలువురు ఫ్యాన్స్ విషెస్ చెప్పారు. ఇందులో కొంతమంది అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. 'కొంతకాలం తర్వాత నీ భార్య, నీ కూతురు ఒకేసారి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరుతారు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'అఫ్రిది ఓ క్రికెట్ జట్టును తయారుచేస్తుండు' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. 'ఇది చాలా తక్కువ సంఖ్య, 11 నెంబర్ చేయి' అని ఓ లేడీ ఫ్యాన్ సెటైర్ వేసింది.
యాషెస్ కంటే గొప్ప:
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగితే యాషెస్ కంటే పెద్ద సిరీస్ అవుతుందని తాజాగా అఫ్రిది పేర్కొన్నారు. 'రెండు పొరుగు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ ఉంటే యాషెస్ కంటే గొప్పగా ఆదరణ పొందేది. తాజా పరిస్థితులు అందుకు అనుగుణంగా కనినిపిస్తోంది. ప్రజలు ఎంతగానో ఇష్టపడే ఆటల్లో కూడా రాజకీయాలు జోక్యం చేసుకోవడమే ఈ పరిస్థితులకు కారణం. మళ్లీ మునుపటి పరిస్థితులు వస్తే బాగుటుందని ఆశిద్దాం' అని అన్నారు.