క్రికెటర్లు రిటైర్ అయిన తర్వాత కామెంటరీ, కోచింగ్ ఇలా రకరకాల వృత్తుల్లో స్థిరపడతారు. అయితే ఒక పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మాత్రం గూండాగిరీ, టెర్రరిజాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు, డబ్బులు ఇచ్చి ఒక ఎంపీని చంపించడానికి ప్రయత్నించాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఖలీద్ లతీఫ్. నెదర్లాండ్స్లో ఇటీవలి కాలంలో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాంతాల్లో కొందరు ఎక్స్ట్రీమిస్టులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న నెదర్లాండ్స్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ను హతమార్చేందుకు ఖలీద్ నజరానా ప్రకటించాడు. గతంలో మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్లు పోటీ నిర్వహించాలని గీర్ట్ అనుకున్నాడు. అయితే నెదర్లాండ్స్తోపాటు పాకిస్తాన్లో కూడా దీనిపై అల్లర్లు జరిగాయి. అలాగే అతనికి విపరీతంగా బెదిరింపు కాల్స్ వచ్చాయి.

ఈ క్రమంలో ఈ పోటీని గీర్ట్ రద్దు చేశాడు. కానీ అతన్ని చంపేందుకు పలువురు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 2004 నుంచి నెదర్లాండ్స్ ప్రభుత్వం అతనికి భద్రత కల్పిస్తూ వస్తోంది. 2019లో ఒక ముస్లిం వ్యక్తి.. గీర్ట్ను హతమార్చేందకు ప్లాన్ వేశాడు. అతన్ని అరెస్టు చేసిన అధికారులు జైల్లో పెట్టారు. ఈ క్రమంలోనే పాక్ మాజీ క్రికెటర్ ఖలీద్ లతీఫ్.. గీర్ట్ తల తీసిన వారికి 21 వేల యూరోలు అంటే 22500 డాలర్లు నజరానా ఇస్తానని ప్రకటించాడు.
ఇది మన లెక్కల్లో రూ.18.5 లక్షలపైనే. దీనిపై నెదర్లాండ్స్లో కేసు నమోదైంది. ఈ విచారణ సందర్భంగా ఖలీద్పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ప్రపంచంలో ఎవరో ఒకరు ఖలీద్ ఇచ్చిన ఆఫర్ను తీసుకొని వైల్డర్స్ను చంపే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నిందితుడు ఖలీద్కు ఈ విషయం తెలుసు. అయినా సరే ఇలాంటి పని చేశాడు. దీంతో గీర్ట్ వైల్డర్స్ను చంపాలనే వాళ్లు మరింత పెరిగిపోతారు' అని జడ్జి అన్నారు.
అయితే ఈ కేసు విచారణ సమయంలో ఖలీద్ కోర్టుకు రాలేదు. ఈ విషయంలో లీగల్ సహకారం అందించాలని పాకిస్తాన్ను డచ్ ప్రభుత్వం కోరింది. కానీ పాక్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఈ విషయంపై స్పందించిన గీర్ట్.. 'ఈ విచారణకు నిందితుడు రాకపోవడం నిజంగా దురదృష్టకరం. పాకిస్తాన్ అధికారులు సహకారం అందించకపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నేను అవసరమైతే ప్రధానిని కలిసి ఖలీద్ను అరెస్టు చేసి నెదర్లాండ్స్ తీసుకురావాలని కోరతా' అని చెప్పాడు.