IND vs PAK: ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్-4 మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ గెలుస్తుందని మాజీ పాక్ కెప్టెన్ రషీద్ లతీఫ్ పేర్కొన్నారు. గత వారం జరిగిన ఉత్కంఠభరిత పోరు తర్వాతఈ రెండు జట్లు ఆదివారం మరోసారి తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్పై ఉత్కంఠ మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉందని.. ఇది గతంలో లేని విధంగా ఇప్పుడు మైదానంలో కూడా కనిపిస్తోందని రషీద్ లతీఫ్ వెల్లడించారు.
మైదానం బయట చాలా జరుగుతోందని.. పాకిస్థాన్ తమ మ్యాచ్కు ముందు జరిగే పత్రికా సమావేశాన్ని వరుసగా రెండోసారి రద్దు చేసుకుందని చెప్పారు. దీనికి సరైన కారణం ఎవరికీ తెలియకపోయినా, ఈ బహుళ దేశాల టోర్నమెంట్లో నాటకాలకు కొదవలేదని.. ఏం జరుగుతుందో తెలియడం లేదని లతీఫ్ అన్నారు. టీ20ల్లో ఎవరైనా గెలవచ్చని, అయితే భారత్ చాలా బలమైన జట్టు అని మాజీ పాకిస్తాన్ కెప్టెన్ లతీఫ్ అభిప్రాయపడ్డారు. "టీ20లో ఏదైనా జరగవచ్చు. ఒమన్ నిన్న చాలా బాగా ఆడింది. టీ20లలో గెలిచే జట్టును అంచనా వేయడం కష్టం. వన్డేలు, టెస్టుల్లో ఎవరు గెలుస్తారో చెప్పవచ్చు. కానీ టీ20లలో చెప్పలేం. అయినప్పటికీ మనం గమనిస్తే భారత్ ఒక బలమైన జట్టు" అని ఆయన అన్నారు.

ఐపీఎల్కు లతీఫ్ ప్రశంసలు
భారత్కు అన్ని ఫార్మాట్లలో ఈ స్థాయి ఆధిపత్యం సాధించడానికి వారి పటిష్టమైన దేశీయ వ్యవస్థ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కారణమని లతీఫ్ కొనియాడారు. భారత ఆటగాళ్లు ఆడే లీగ్ చాలా నాణ్యమైనదని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ పీఎస్ఎల్లో ఆడుతుందని.. ఐపీఎల్, పీఎస్ఎల్ ల మధ్య భారీ తేడా ఉందన్నారు. "రెండు జట్ల మధ్య ఉన్న మరో తేడా అనుభవం. రోహిత్, విరాట్, జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అవ్వడంతో భారత జట్టు కాస్త అనుభవం లేని జట్టుగా కనిపిస్తుంది. అయినా కూడా వారు చాలా నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నారు" అని ఆయన అన్నారు.
పాకిస్తాన్ బలహీనమైన బ్యాటింగ్ ఆర్డర్ కారణంగా ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోందని లతీఫ్ చెప్పారు. వారి పేలవమైన ఆరంభాలే దీనికి నిదర్శనమన్నారు. ఓపెనర్ సైమ్ అయూబ్ ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు తన ఖాతాను తెరవలేకపోయాడు. మూడు డకౌట్లు నమోదు చేశాడు. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మూడు మ్యాచ్లలో 0, 3, 20 పరుగులు మాత్రమే చేశాడు. దూకుడు బ్యాటింగ్కు ఎంపికైన సాహిబ్జాదా ఫర్హాన్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. పాకిస్తాన్ క్రమంగా హసన్ నవాజ్ను బ్యాటింగ్ లోయర్ ఆర్డర్ లో పంపుతోంది. ఒకప్పుడు ఓపెనర్గా ఉన్న అతను, ఇప్పుడు 4వ స్థానంలో, ఇప్పుడు 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్కు వస్తున్నాడు. ఆసియా కప్లోకి పాకిస్తాన్ అత్యంత ఆశాజనకమైన బ్యాటర్గా ప్రవేశించిన హసన్, ఇప్పుడు లోయరార్డర్ పాత్రకు పరిమితమయ్యాడు.
"పాకిస్తాన్ బలహీనమైన జట్టులా కనిపిస్తోంది, అది అందరికీ తెలుసు. కానీ వారిని తక్కువ అంచనా వేయలేం. ఇది భారత్కు 75-25గా ఉంది. భారత్ ఫేవరెట్గా ఉంది" అని లతీఫ్ అన్నారు."కొన్నిసార్లు ఒక్క ఆటగాడు ఫామ్లో లేకపోవడం చూస్తాం, కానీ పాకిస్తాన్ విషయంలో పరిస్థితి వేరు. సైమ్ అయూబ్ ఫామ్లో లేడు, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఫామ్లో లేడు, మహ్మద్ హారిస్ కష్టపడుతున్నాడు, సాహిబ్జాదా ఫర్హాన్ టచ్లో లేడు, హసన్ నవాజ్ కూడా ఇబ్బందులు పడుతున్నాడు. టాప్ ఆరుగురిలో ఐదుగురు బ్యాటర్లు కష్టపడుతుంటే గెలవడం కష్టం" అని ఆయన అన్నారు.
ఒకవేళ పాకిస్తాన్ గెలవాలంటే వారి బ్యాటర్లలో ఒకరు అసాధారణంగా ఆడాలని లతీఫ్ అభిప్రాయపడ్డారు. లేకపోతే భారత్ ఒక బలమైన శక్తి అని ఆయన ముగించారు. "వ్యక్తిగత అద్భుతాలు మాత్రమే పాకిస్తాన్కు విజయం సాధించడంలో సహాయపడతాయి. ఎవరైనా అద్భుతంగా ఆడితేనే అది సాధ్యం. భారత్ చాలా బలమైన జట్టు అనడంలో సందేహం లేదు. పాకిస్తాన్కు భారత్పై విజయం నమోదు చేయడం కష్టంగా ఉంటుంది," అని ఆయన ముగించారు.