పాకిస్థాన్ క్రికెట్లో చిత్రవిచిత్రమైన ఘటనలకు ఎలాంటి కొదవ ఉండదు. మైదానంలో ప్లేయర్ల ఆటతీరు కంటే మైదానం బయట వారు చేసే కామెంట్స్.. అక్కడి పరిస్థితిలు తరచూ చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ తన దేశ ప్రభుత్వానికి సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఏకంగా దేశ ప్రధాని ఇచ్చిన బహుమతి చెక్ బ్యాంకులో బౌన్స్ అయిందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రపంచ కప్ గెలిచిన ఆనందం.. చెక్ రూపంలో విషాదం
పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో 2009 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఆ ఏడాది పాక్ జట్టు టీ20 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అప్పటి పాకిస్థాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ ప్లేయర్లను సత్కరించడానికి తన నివాసానికి ఆహ్వానించారు. జట్టులోని ప్రతి క్రీడాకారుడికి ప్రోత్సాహకంగా 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

బ్యాంకుకు వెళ్తే బయటపడిన అసలు రంగు
ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ చేదు అనుభవాన్ని సయీద్ అజ్మల్ గుర్తు చేసుకున్నారు. "ప్రధాని మాకు రూ.25 లక్షల చెక్ ఇచ్చినప్పుడు మేము చాలా సంతోషించాం. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. కానీ ఆ చెక్కును మార్చుకోవడానికి మేము బ్యాంకుకు వెళ్లినప్పుడు మాకు పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వం ఇచ్చిన ఆ చెక్ బౌన్స్ అయింది" అని సయీద్ అజ్మల్ నవ్వుతూనే ఆవేదన వ్యక్తం చేశారు.
చేతులెత్తేసిన పీసీబీ
ప్రభుత్వం ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అవుతుందా అని తాను ఆశ్చర్యపోయానని అజ్మల్ తెలిపారు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులను సంప్రదిస్తే.. వారు కూడా సహాయం చేయడానికి నిరాకరించారని ఆయన పేర్కొన్నారు. "ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీ, మాకు సంబంధం లేదు" అని బోర్డు అధికారులు స్పష్టం చేశారట. చివరికి ఐసీసీ నుంచి వచ్చిన ప్రైజ్ మనీ తప్ప, ప్రభుత్వం ప్రకటించిన ఒక్క రూపాయి కూడా తమకు అందలేదని అజ్మల్ వెల్లడించారు.
భారత్తో తమను తాము పోల్చుకునే పాకిస్థాన్ ఆటగాళ్లు.. కనీసం తమ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను కూడా నగదుగా మార్చుకోలేని స్థితిలో ఉన్నారంటూ నెటిజన్లు ఇప్పుడు సయీద్ అజ్మల్ వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు.