హైదరాబాద్: యోయో టెస్టులో మరో అవకాశం కావాలని కోరుతున్నాడు భారత మాజీ సెలక్టర్ సందీప్ పాటిల్. భారత్ తరపున ఒకప్పుడు క్రికెటర్గానూ బాధ్యతలు నిర్వర్తించిన సందీప్ పాటిల్.. టెస్టు క్రికెట్ మ్యాచ్లో ఎలా అయితే ప్రతి ఆటగాడికి రెండో అవకాశం వస్తుందో... యో యో టెస్టులో ఫెయిలైన వారికి కూడా మరో అవకాశం ఇవ్వాలని అంటున్నాడు. అంబటి రాయుడు, మొహమ్మద్ షమి, సంజు శాంసన్ యో యో టెస్టు ఫెయిలై టీమిండియాలో చోటు కోల్పోయారు. యో యో టెస్టు పాసైతేనే జట్టులో స్థానం అని బీసీసీఐ భారత ఆటగాళ్లకు కఠిన నిబంధన విధించిన సంగతి తెలిసిందే.
అఫ్గాన్తో టెస్టుకు ముందు షమి యోయోలో ఫెయిలవ్వడంతో జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటన దృష్ట్యా ఆటగాళ్లు మళ్లీ యోయోలో పాల్గొంటున్నారు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన అంబటి రాయుడు ఈ టెస్టులో ఫెయిలవ్వడంతో జట్టులో చోటు కోల్పోయాడు. రాయుడు స్థానంలో సురేశ్ రైనాను తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా దీనిపై సందీప్ పాటిల్ స్పందించాడు.
'టెస్టు మ్యాచ్లో ఎలాగైతే ఆటగాళ్లకు రెండు ఇన్నింగ్స్ల ద్వారా తామేంటో నిరూపించుకోవడానికి అవకాశం దక్కుతుందో... అలాగే బీసీసీఐ అధికారులు కూడా యో యో టెస్టు ఫెయిలైన వారికి మరో అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఆటగాడు యో యో టెస్టు ఫెయిలైతే.. గంటల వ్యవధిలో లేదంటే మరుసటి రోజు అతడికి టెస్టు నిర్వహించాలి. ఏడాది పాటు దేశవాళీ క్రికెట్లో అంబటి రాయుడు అద్భుతంగా రాణించాడు.'
'ఇటీవల ముగిసిన ఐపీఎల్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. అలాంటి ఆటగాడు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లడం, లేకపోవడంపై కేవలం 30 నిమిషాల్లో ఎలా నిర్ణయం తీసేసుకుంటారు. ఆటగాళ్లను జట్టు నుంచి ఇలా తప్పించడం సరికాదు. ఇది వారి కెరీర్పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది' అని పాటిల్ అన్నారు.