
గత వరల్డ్ కప్ తప్పులు..
ఏ జట్టు అయినా వరల్డ్ కప్ వంటి టోర్నీలో రాణించాలంటే సెలెక్షన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సరైన జట్టును ఎంపిక చేయకపోతే అది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది. ఇదే విషయంపై మాట్లాడిన గవాస్కర్.. 'మన మీడియా వాళ్లు వెళ్లి విదేశీ నిపుణుల అభిప్రాయాలు తీసుకోకపోతే చాలు. వాళ్లు తమ తమ దేశాలకు అనుకూలంగానే అభిప్రాయాలు చెప్తారు. చివరి వన్డే వరల్డ్ కప్లో అదే జరిగింది కదా. ఆ ఏడాది ఐపీఎల్లో ఆడాడని కొత్త కుర్రాడి పేరును విదేశీ నిపుణులు గట్టిగా పుష్ చేశారు. చివరకు సత్తా నిరూపించుకున్న ఆటగాడిని కాదని, కొత్త వాడిని ఎంపిక చేశారు. అతను కూడా ఆడింది తక్కువే' అని గవాస్కర్ చెప్పాడు.

అంబటి రాయుడికి మొండి చెయ్యి..
భారత జట్టుకు ఆడగలిగే సత్తా లేని ఆటగాళ్ల గురించి మరీ ఎక్కువగా పదే పదే చూపించడం వల్ల కలిగే లాభం ఉండదని, సదరు ఆటగాడి వల్ల నిజంగా విలువైన ఆటగాడి అవకాశాలు దెబ్బతింటాయని అన్నాడు. గవాస్కర్ ఎవరి పేరూ చెప్పకపోయినా.. అతను ఎవరి గురించి అన్నాడో అందరికీ అర్థమైపోయింది. గత వన్డే వరల్డ్ కప్లో నాలుగు స్థానంలో అంబటి రాయుడును ఆడించాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయించింది. దాదాపు ఏడాది పాటు అతన్ని ఆ స్థానంలో ఆడించింది కూడా.

3డీ ప్లేయర్ మాయలో..
కానీ చివర్లో జట్టును ప్రకటించినప్పుడు అతనికి అవకాశం దక్కలేదు. ఐపీఎల్లో ఫర్వాలేదనిపించిన విజయ్ శంకర్ను ఎంపిక చేశారు. అతనో 3డీ ప్లేయర్ అంటూ సెలెక్టర్లు కామెంట్ చేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఆల్రౌండర్ అయిన అతను.. భారత్ తరఫున మూడు మ్యాచులు ఆడాడు. వీటిలో కేవలం 58 పరుగులు చేసి రెండంటే రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత కాలికి గాయం అవడంతో ఇక ఏ మ్యాచూ ఆడలేదు. ఇప్పుడు కూడా సెలెక్టర్లు అలాంటి పొరపాటే చేస్తే.. జట్టుకు తీవ్రమైన నష్టం తప్పదని సునీల్ గవాస్కర్ గుర్తు చేశాడు.


Click it and Unblock the Notifications












