కీలక ఆటగాళ్లకు గాయాలు..
టీమిండియా ఎన్నడూ లేనంత బలహీనమైన జట్టుతో టెస్టు సిరీస్లో అడుగు పెడుతోంది. వెన్ను గాయం కారణంగా భారత కీలక పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ తొలి రెండు టెస్టులు ఆడటం లేదు. మిగతా వాటిలో ఆడతాడని గ్యారంటీ లేదు. ఇక రవీంద్ర జడేజా కోలుకున్నా కూడా ఆసీస్పై సత్తా చాటతాడని కచ్చితంగా చెప్పలేం. వీళ్లందరికీ తోడు శ్రేయాస్ అయ్యర్ కూడా తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఇక టెస్టుల్లో భారత్కు ఎన్నో విజయాలు అందించిన రిషభ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా ఆటకు దూరం అవ్వాల్సి వచ్చింది.
అతనే ఆధారం..
ఇంత మంది కీలక ఆటగాళ్లు గాయాలపాలవడంతో భారత జట్టు చాలా బలహీనంగా ఉందని గ్రెగ్ ఛాపెల్ అన్నాడు. దీంతో ఆ జట్టు విరాట్ కోహ్లీపై చాలా ఎక్కువగా ఆధారపడుతుందని స్పష్టం చేశాడు. దీన్ని క్యాష్ చేసుకొని, కోహ్లీని ఒత్తిడిలోకి నెట్టగలిగితే ఆస్ట్రేలియా కచ్చితంగా ఈ సిరీస్ తన ఖాతాలో వేసుకోగలుగుతుందని ఛాపెల్ అన్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ టెస్టు ఫార్మాట్లో అంత గొప్పగా లేని సంగతి తెలిసిందే. ఆసీస్ సిరీస్లో అయినా అతను మళ్లీ తన పూర్వపు ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అలా జరిగితే విజయం వాళ్లదే..
భారత్లో ఆడేందుకు వెళ్లే జట్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఛాపెల్ సూచించాడు. 'భారత్లో పరిస్థితులు విజిటింగ్ జట్లను అయోమయంలో పడేస్తాయి. మ్యాచ్ ఎటూ పోవడం లేదు. డ్రా అవుతుంది అనిపిస్తుంది. కానీ సడెన్గా ఒక్క రోజులో మ్యాచ్ ముగుస్తుంది. ఇండియన్స్కు ఇది అలవాటే. కాబట్టి ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా దీనికి అలవాటు పడాలి. చాలా అలర్ట్గా ఉండాలి. బంతితో, బ్యాటుతో, మనసుతో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఒక్క మాట గుర్తుంచుకోవాలి.. మ్యాచ్ కనుక ఐదో రోజు పోటాపోటీగా ఉందంటే.. ఇండియా గెలిచి తీరుతుంది' అని విశ్లేషించాడు.