
ప్రస్తుతం టీమిండియాలో బెస్ట్ స్పిన్నర్ ఎవరు? అని అడిగితే అందరి మదిలో మొదటగా మెదిలే పేరు కుల్దీప్ యాదవ్. నిలకడగా అవకాశాలు దక్కకపోయినా.. అతను మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది చివర్లో బంగ్లాదేశ్ పర్యటనే దీనికి నిదర్శనం. ఆ పర్యటనలో ఆడిన తొలి టెస్టులో కుల్దీప్కు అవకాశం దక్కింది. చాలా కాలం తర్వాత తనకు దక్కిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న కుల్దీప్.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. కానీ ఆ తర్వాతి మ్యాచులోనే అతన్ని బెంచ్కు పరిమితం చేశారు.
ఇలా అతను సత్తా చాటినా కూడా పక్కన కూర్చోపెట్టడం చాలా విమర్శలకు దారి తీసింది కూడా. ఇదే విషయాన్ని మాజీ లెజెండ్ వసీం జాఫర్ గుర్తుచేశాడు. ఇది ఏ ఆటగాడికైనా కష్టమైన పని అని తేల్చేశాడు. 'వరుసగా అవకాశాలు దక్కకపోయినా సరే.. ఆడిన ప్రతి మ్యాచులో రాణించడం అంటే మాటలు కాదు. అది ఎవరికైనా అంత ఈజీ కాదు. కానీ కుల్దీప్ అదే చేస్తున్నాడు. అతనికి అవకాశం వస్తే రాణిస్తున్నాడు. ఆ వెంటనే పక్కన పెట్టేస్తున్నారు. అయినా మళ్లీ అవకాశం వస్తే సత్తా చాటుతున్నాడు' అని కొనియాడాడు. అతనికి కివీస్తో తొలి టీ20లో అవకాశం ఇవ్వాలని సూచించాడు.

శ్రీలంక, న్యూజిల్యాండ్తో జరిగిన వన్డే సిరీసుల్లో ఆడిన కుల్దీప్ అద్భుతంగా రాణించాడు. ఈ రెండు సిరీసులు భారత్ గెలవడంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఇటీవలి కాలంలో టీ20ల్లో అతనికి ఆడే అవకాశం రాకపోయినా.. పొట్టి ఫార్మాట్లో కుల్దీప్ గణాంకాలు చాలా బాగున్నాయి. ఈ ఫార్మాట్లో మొత్తం 25 మ్యాచులు ఆడిన అతను 44 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంత మంచి గణాంకాలు ఉన్న అతనికి తొలి టీ20లో అవకాశం ఇవ్వాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు.