డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు చిత్తుగా ఓడింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఫ్యాన్స్, మాజీలు మండిపడ్డారు. అతన్ని కెప్టన్గా తొలగించాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ పట్టించుకోని బీసీసీఐ సెలెక్టర్లు విండీస్ టూర్కు జట్టను ప్రకటించారు. టెస్టు, వన్డేల్లో కెప్టెన్గా రోహిత్ పేరునే ప్రకటించారు. దీనిపై మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.
డబ్ల్యూటీసీ వంటి ఐసీసీ టోర్నీ ఓడిపోతే ఎవరికీ కనీసం బాధ్యత లేదా? అని గవాస్కర్ నిలదీశాడు. 'అసలు ఎవరికీ బాధ్యత లేదా? డబ్ల్య్యూటీ ఫైనల్ తర్వాత కొత్త కెప్టెన్ గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. అలా చేశారా? మా రోజుల్లో అయితే కెప్టెన్ను అపాయింట్ చేసే మీటింగ్ జరిగేది. ఆ తర్వాత రెండ్రోజుల తర్వాత సెలెక్షన్ మీటింగ్లో పాల్గొనాలని అతనికి చెప్పేవాళ్లు' అని సన్నీ చెప్పాడు.

'కెప్టెన్కు ఓటింగ్ హక్కు ఉండేది కాదు. ఎందుకంటే అతను కో-ఆప్టెడ్ మెంబర్. కానీ తనకు ఎక్స్ట్రా బౌలర్, బ్యాటర్, స్పిన్నర్ కావాలంటే అడిగే అవకాశం ఉండేది' అని లిటిల్ మాస్టర్ వివరించాడు. అలాగే కెప్టెన్ కనుక విఫలమైతే అతన్ని వెంటనే పోస్టు నుంచి తప్పించేవారని కూడా గవాస్కర్ వెల్లడించాడు. కానీ ఇప్పుడు అలా జరడగడం లేదని విమర్శించాడు.
'గత 10-12 ఏళ్లుగా మన క్రికెట్లో అలా జరగడం లేదు. ఒక కెప్టెన్ను నియమిస్తే.. ఎన్ని సిరీసులు ఓడినా సరే అతన్ని మార్చడం లేదు. అతను మంచి ప్రదర్శన చేస్తుంటే చాలు. కెప్టెన్సీ పోదు. కానీ మా రోజుల్లో అలా ఉండేది కాదు. జవాబుదారీ తనం ముఖ్యంగా ఉండేది' అని గవాస్కర్ చెప్పాడు. సెలెక్షన్ కమిటీలో కనుక బలమైన సెలెక్టర్ ఉండి ఉంటే.. రోహిత్ను రకరకాలుగా ప్రశ్నించేవాడని తెలియజేశాడు.
'బలమైన సెలెక్టర్ కనుక ఉండి ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ ఎందుకు ఆడలేదు? టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎందుకు ఎంచుకున్నాం? ట్రావిస్ హెడ్ మీద షార్ట్ బాల్ ట్యాక్టిక్ను ఆలస్యంగా ఎందుకు ప్రయోగించారు? ఇలాంటి కీలకమైన ప్రశ్నలు అడిగేవాళ్లు. ఇవి ముఖ్యంగా కూడా. ఓడిపోయినా కూడా వాళ్లను కెప్టెన్గా ఉంచాలంటే ఉంచుకోండి. కానీ జవాబుదారీతనం ముఖ్యం' అని చెప్పుకొచ్చాడు.