
న్యూజిల్యాండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఓటమిపాలైంది. ఈ క్రమంలో రెండో మ్యాచ్లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది. మూడు టీ20ల సిరీస్లో పోటీలో ఉండాలంటే ఈ మ్యాచ్లో భారత్ గెలవాల్సిందే. ఈ క్రమంలోనే మాజీ లెజెండ్ వసీం జాఫర్ వింత సలహా ఇచ్చాడు. వచ్చే మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్ను జట్టులో నుంచి తీసేయాలని సూచించాడు. అతని స్థానంలో మరో బ్యాటర్ను తీసుకోవాలని చెప్పాడు.
తొలి మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్కు బౌలింగ్ చేసే అవకాశం ఎక్కువ దక్కలేదు. కెప్టెన్ పాండ్యా కేవలం ఒక్క ఓవర్ మాత్రమే ఉమ్రాన్ చేత వేయించాడు. అతను ఆ ఓవర్లో 16 పరుగులు ఇవ్వడంతో మళ్లీ బౌలింగ్ చేయించలేదు. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు రాణించారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ రెండు కీలక వికెట్లు తీయడంతోపాటు హాఫ్ సెంచరీ కూడా చేశాడు. కానీ టీమిండియాకు ఓటమి మాత్రం తప్పలేదు. అయితే తమది చాలా యంగ్ టీం అని, కాబట్టి ఇలాంటి వైఫల్యాలు వస్తూనే ఉంటాయని పాండ్యా అన్నాడు. వీటి నుంచి విలువైన పాఠాలు నేర్చుకుంటామని చెప్పాడు.
ఈ మ్యాచ్లో మిగతా పేసర్లు కూడా పెద్దగా రాణించలేదు. అర్షదీప్ సింగ్ ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. అయినా సరే జాఫర్ మాత్రం.. ఉమ్రాన్ బౌలింగ్లో వేరియేషన్ లేదన్నాడు. తను వేసిన తొలి ఓవర్లో కటర్ డెలివరీలు వేయాల్సిందని, కానీ ఉమ్రాన్ అలా చేయలేదని వివరించాడు. కాబట్టి అతన్ని రెండో మ్యాచ్లో తీసేయాలని సూచించాడు. అతని బదులుగా మరో బ్యాటర్ను జట్టులోకి తీసుకుంటే మంచిదన్నాడు. జితేశ్ శర్మ లేదంటే పృథ్వీ షాను ఈ మ్యాచ్లో ఆడిస్తే బెటర్ అని అభిప్రాయపడ్డాడు. మరి టీమిండియా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.