
బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. సిరీస్ ఆరంభానికి ముందే వెన్నునొప్పితో రిషభ్ పంత్ జట్టుకు దూరమయ్యాడు. అసలు వీటన్నింటికీ ముందే జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆసియా కప్ సమయంలో రవీంద్ర జడేజా కూడా గాయపడ్డాడు. ఇక బంగ్లా పర్యటనలో కుల్దీప్ సేన్, దీపక్ చాహర్ కూడా గాయాలపాలై జట్టుకు దూరమయ్యారు.
దీనిపై రెండో వన్డే అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు సగం సగం ఫిట్నెస్ ఉన్న ఆటగాళ్లు పనికిరారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఇంత మంది గాయపడటానికి కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తామని, ఎన్సీయే (నేషనల్ క్రికెట్ అకాడమీ) వరకు వెళ్లయినా ఆటగాళ్ల వర్క్లోడ్ మేనేజ్ చేస్తామని చెప్పాడు. రోహిత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా లెజెండ్ బ్రాడ్ హాగ్ విమర్శలు చేశాడు.

'నీకు బంగారం కావాలి, ఖజానా కావాలి అంటే మట్టిలో దిగి తవ్వాలి కదా. క్రమశిక్షణతో కష్టపడాలి. అంటే నువ్వు ఏం తింటున్నావో గమనించుకుంటూ ఎక్సర్సైజులు చేయాలి. తర్వాతి టోర్నమెంట్ కోసం ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలి' అని హాగ్ చెప్పాడు. ఉదాహరణకు, ప్రస్తుతం టీ20 టోర్నమెంట్ ఆడుతున్న ఆటగాడు.. తర్వాత టెస్టు సిరీస్ ఉంటే నెట్స్లో మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేయాలని, టెస్టు సిరీస్కు సిద్ధమవ్వాలని హాగ్ వివరించాడు. విధానం మీద పడి ఏడవకుండా.. ముందు మనం ఏం చేస్తున్నామో చూసుకోవాలన్నాడు.
గాయపడిన వారిలో రోహిత్ కూడా ఉన్న విషయం తను మర్చిపోయినట్లు మాట్లాడుతున్నాడని హాగ్ విమర్శించాడు. తన శరీరం ఎలా ఉండాలనే విషయం ఆటగాడి చేతుల్లోనే ఉంటుందని, దీనిపై అతనే దృష్టిపెట్టాలని హాగ్ చెప్పాడు. అంతేకానీ మ్యాచులు ఎక్కువైపోయాయని, చాలా ఫార్మాట్లు ఆడుతున్నామని సాకులు వెతుక్కోవడం కరెక్ట్ కాదన్నాడు.