
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో భారత జట్టుకు ఘనమైన ఆరంభం లభించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ సిరీసులో జరగాల్సిన మూడో టెస్టు వేదికను మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియాలోని మీడియా సంస్థలు మండిపడ్డాయి. కావాలనే అశ్విన్కు మంచి రికార్డు ఉన్న స్టేడియానికి ఈ మ్యాచ్ మార్చారని ఆరోపణలు చేశాయి. వీటిపై టీమిండియా మాజీ దిగ్గజం ఆకాష్ చోప్రా మండిపడ్డాడు.
ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్ సహా మీడియా సంస్థలు.. తమ దేశ జట్టుకు స్ఫూర్తినిచ్చే వార్తలు వదిలేసి, ఆ జట్టును మరింత భయపెట్టేందుకు చూస్తున్నాయని విమర్శించాడు. 'మూడో టెస్టు వేదికను ధర్మశాల నుంచి మార్చారు. అంతే, వాళ్లు ఇక ఇండోర్ మైదానంపై పడ్డారు. ఇక్కడి పిచ్ సాధారణంగా ఫ్లాట్గా ఉండి బ్యాటర్లకు అనుకూలిస్తుంది. కానీ ఫాక్స్ క్రికెట్ చెప్తున్న మాటు వింటే.. ఇక్కడ పూర్తిగా స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తారని నమ్ముతాం. అలాంటి స్నేహితులు ఉంటే.. ఇక శత్రువుల అవసరం ఏముంది?' అని చోప్రా ప్రశ్నించాడు.
ఇండోర్లో ఇప్పటి వరకు కేవలం రెండు టెస్టు మ్యాచులు మాత్రమే జరిగాయి. వాటిలో భారత్ భారీ విజయాలు సాధించిన మాట వాస్తవమే. దీనిపై మాట్లాడిన చోప్రా.. 'ఇప్పటి వరకు ఇండోర్లో రెండు టెస్టులు జరిగాయి. వీటిలో పుజారా, మయాంక్ అగర్వాల్ అద్భుతంగా ఆడారు. భారీ స్కోర్లు నమోదయ్యాయి' అని గుర్తుచేశాడు.
కానీ ఫాక్స్ క్రికెట్ అనే పేరుతో ఒక ఛానెల్ ఉందని, అది ఆస్ట్రేలియాకు చెందిందని చెప్పాడు. ఆ ఛానెల్ చెప్పే మాటల ప్రకారం, ధర్మశాల నుంచి వేదికను మార్చిన స్టేడియంలో అశ్విన్ సగటు కేవలం 12.5 మాత్రమే. ఇదే విషయాన్ని చెప్పిన చోప్రా.. మ్యాచ్ వేదిక మారింది అనగానే ఆ విషయం తప్ప మరేదీ వాళ్లకు తట్టలేదా? అని ప్రశ్నించాడు. అశ్విన్ను ఎదుర్కోవడం అసాధ్యమనే భావనను అక్కడి మీడియానే ఆసీస్ ఆటగాళ్ల బుర్రల్లోకి ఎక్కిస్తోందని ఇప్పటికే కొందరు ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.