
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత అమ్మాయిలు ఓటమిపాలయ్యారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ లక్ష్య ఛేదనలో జెమీమా రోడ్రిగెజ్, హర్మన్ప్రీత్ కౌర్ అద్భుతంగా పోరాడారు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన హర్మన్ వింత పద్ధతిలో అవుటైంది.
వేర్హామ్ వేసిన బంతికి రెండు పరుగులు తీసేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ సమయంలో ఆమె పరుగు పూర్తి చేసినట్లే కనిపించింది. కానీ సరిగ్గా క్రీజు ముందు బ్యాటు నేలపై పెట్టినప్పుడు.. నేలలో దిగబడిన బ్యాటు ముందుకు జారలేదు. దీంతో ఆమె రనౌట్ అయింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ లెజెండ్ నాజర్ హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కామెంటరీలో ఉన్న అతను హర్మన్ప్రీత్ చేసింది 'స్కూల్ పిల్లలు చేసే పొరపాటు' అని విమర్శించాడు. ఈ విషయం మ్యాచ్ ఆడుతున్న హర్మన్కు తెలియలేదు.
కానీ మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అది విన్న ఆమె ఆశ్చర్యపోయింది. 'అలా అన్నాడా? మ్యాచ్ తర్వాతా? ఓకే. నాకు తెలీదు. అది ఆయన ఆలోచనా విధానం. కానీ కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి. ఆటాళ్లు సింగిల్ తీసే సమయంలో కూడా ఇలా బ్యాట్ స్టక్ అవడం చాలాసార్లు చూశా. ఇది మా దురదృష్టం అని మాత్రం ఒప్పుకుంటా' అని హర్మన్ చెప్పింది.
అక్కడితో ఆగకుండా.. 'ఇది దురదృష్టం అని అనుకుంటున్నా. కానీ స్కూల్ గర్ల్ చేసే తప్పు అని అనుకోవట్లేదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాం కాబట్టి మాకు ఆ మాత్రం మెచ్యూరిటీ ఉంది. ఆయన ఏమన్నా సరే.. అది ఆయన సొంత అభిప్రాయం. నేను మాత్రం అలా ఆలోచించడం లేదు' అని చెప్పుకొచ్చింది. తను అలా అవుటైనప్పుడు హర్మన్ప్రీత్ కూడా చాలా ఫ్రస్టేట్ అయింది. బ్యాటును నేలకోసి కొట్టింది. తనను తను తిట్టుకుంటూ పెవిలియన్ వైపు వెళ్లింది. చివరగా దీప్తి శర్మకు బ్యాటింగ్, పిచ్ గురించి కొన్ని సూచనలు చేసి వెళ్లింది. మ్యాచ్ ఓడిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంది.