ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి ఇదే లాస్ట్ వరల్డ్ కప్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అతని వయసు 35 సంవత్సరాలు. మరో వరల్డ్ కప్ ఆడే సమయానికి కోహ్లీ వయసు 39 సంవత్సరాలకు చేరుతుంది. అందుకే కోహ్లీకి ఇది చివరి వరల్డ్ కప్ అని చాలా మంది అంటున్నారు.
అయితే ఈ వార్తలన్నింటినీ వెస్టిండీస్ మాజీ లెజెండ్ క్రిస్ గేల్ కొట్టిపారేశాడు. 'కోహ్లీలో మరో వరల్డ్ కప్ ఆడే సత్తా ఉంది. ఇది అతని చివరి వరల్డ్ కప్ అని నేను అనుకోవడం లేదు. ఈ వరల్డ్ కప్లో ఇండియా కచ్చితంగా ఫేవరెట్. వాళ్లు స్వదేశంలో ఆడటం కూడా ఈ టోర్నీపై ఆసక్తిని పెంచుతోంది. ఈ టోర్నీ కోసం ఏ జట్టును ఎంపిక చేస్తారనేది ఇప్పుడు చాలా ఇంట్రస్టింగ్ టాపిక్' అని గేల్ అన్నాడు.

టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా తన చివరి వన్డే వరల్డ్ కప్ను స్వదేశంలోనే ఆడాడు. 2011లో భారత్ గెలిచిన వరల్డ్ కప్ అతనికి చివరిది. ఈ క్రమంలోనే ఈసారి జరిగే వరల్డ్ కప్.. కోహ్లీకి చివరిదని ప్రచారం జరుగుతోంది. అయితే ఫిట్నెస్పై బాగా ఫోకస్ పెట్టే కోహ్లీ.. వచ్చే వరల్డ్ కప్ ఆడలేడని అనుకోవడం పొరపాటేనని గేల్ అభిప్రాయపడుతున్నాడు.
'విరాట్ కోహ్లీ ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ షూస్లో ఉన్నాడు. తను ఆడే విధానం, మాట్లాడే విధానంతోపాటు కుర్రాళ్లకు మార్గదర్శనం చేస్తున్నాడు. ఇవేకాదు, తనకు స్వతహాగా ఉండే ప్యాషన్తో క్రికెట్ ఆడుతున్నాడు. ఒకప్పుడు సచిన్ ఉన్న స్థానంలో ఇప్పుడు ఆ జట్టులో కోహ్లీ ఉన్నాడు. అందరూ కూడా కోహ్లీ కోసం వరల్డ్ కప్ గెలవాలని అనుకుంటున్నారు.' అని ఇటీవలే వీరేంద్ర సెహ్వాగ్ కూడా చెప్పాడు.