
టీ20ల్లో అద్భుతమైన ఫార్మాట్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. మిగతా ఫార్మాట్లలో పెద్దగా రాణించడంలేదు. టీ20 నుంచి తన ఆటను వన్డేలకు తగ్గట్లుగా మలచుకోవడంలో సూర్య ఫెయిలయ్యాడు. గతేడాది నుంచి వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. న్యూజిల్యాండ్తో తొలి వన్డేలో చక్కని ఆరంభం లభించినా కూడా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఈ క్రమంలో అతన్ని జట్టు నుంచి తప్పించడమే మంచిదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇలాంటి సమయంలో టీమిండియా మాజీ లెజెండ్ వసీం జాఫర్ మాత్రం సూర్యకు అండగా నిలిచాడు. సూర్య మంచి క్వాలిటీ బ్యాటర్ అని చెప్పిన జాఫర్.. కాకపోతే టీ20ల్లో ఆడే సమయంలో బ్యాటర్ వద్ద పెద్దగా టైం ఉండదని, ఆ రష్కు అలవాటు పడటం వల్లే సూర్య వన్డేల్లో కొంత తడబడుతున్నాడని చెప్పాడు. తొలి వన్డేలో మంచి ఆరంభం లభించినా.. చాలా సులభంగా అవుటవడానికి కూడా అదే కారణం అయ్యుండొచ్చని వివరించాడు. అయితే అతను త్వరలోనే వన్డే ఫార్మాట్లో కూడా రాణిస్తాడని అభిప్రాయపడ్డాడు.

'టీ20ల్లో క్రీజులో కుదురుకే సమయం ఉండదు. దానికి సూర్య అలవాటు పడిపోయాడు. అందు వల్లనే వన్డేల్లో తన ప్రతిభకు న్యాయం చేయలేకపోతున్నాడు. అతను చాలా మంచి క్వాలిటీ ప్లేయర్. నా అభిప్రాయం ప్రకారం 30వ ఓవర్ సమీపంలో కనుక సూర్య క్రీజులోకి వస్తే తన సహజమైన ఆట ఆడగలడని అనుకుంటున్నా.
ఆ సమయంలో తన టీ20 స్పెషల్ ఆటతో రాణించగలడు. ఒక్కోసారి ఎక్కువ ఓవర్లు ఉండటం కూడా కొంత మంది ఆటగాళ్లకు ప్రతికూలంగా మారుతుంది. ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా సూర్య నాలుగో స్థానంలో ఆడుతున్నాడు. కాబట్టి అతనికి ఆ స్థానం కొత్తేం కాదు. త్వరలోనే ఈ ఫార్మాట్లో కూడా సూర్య రాణిస్తాడు' అని జాఫర్ వివరించాడు. మరి రెండో వన్డేలో అయినా సూర్య తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడేమో చూడాలి.