ప్రస్తుతం టీమిండియాలో అత్యంత చెత్త ఫామ్లో ఉన్న బ్యాటర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రిషభ్ పంత్. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన కెరీర్లోనే అత్యంత దిగువ స్థానంలో ఉన్నాడు. కొంత కాలంగా భారీ ఇన్నింగ్స్లు ఆడటంలో విఫలం అవుతున్న అతనికి జట్టులో మాత్రం వరుస పెట్టి అవకాశాలు ఇస్తున్నారు. ఇదేంటని ఫ్యాన్స్ అడగడం మొదలు పెట్టగానే పంత్ను జట్టులో వైస్ కెప్టెన్ చేసేశారు. దీంతో చచ్చినట్లు అతను ఆడే 11 మందిలో ఉంటున్నాడు. కేరళ స్టార్ సంజూ శాంసన్ అద్భుతంగా ఆడుతున్నా అవకాశాలు ఇవ్వరు కానీ.. ఇంత చెత్తగా ఆడుతున్నా పంత్ను ఆడిస్తారా? అంటూ నెటిజన్లు ఈ నిర్ణయంపై మండి పడుతున్నారు.
ఈ క్రమంలో పంత్ ఆటతీరుపై మాజీ లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. పంత్కు కొంత విశ్రాంతి ఇవ్వాలని, తనను తాను రీఇన్వెంట్ చేసుకోవాలని సలహా ఇవ్వాలని చెప్పాడీ 1983 వరల్డ్ కప్ విన్నర్. కొంత విశ్రాంతి తీసుకొని భారత్ వచ్చి ఆడాలని పంత్కు చెప్పడం మంచిదన్నాడు. అలాగే పంత్ విషయంలో జట్టు ఆలోచన ఏంటో తెలియడం లేదని చెప్పిన శ్రీకాంత్.. 'అసలు మీరు ఏం చెయ్యాలని అనుకుంటున్నారు. కొన్ని మ్యాచులు ఆడించిన తర్వాత రెస్ట్ ఇస్తారా? లేక ఇంకొన్ని అవకాశాలు ఇచ్చి పక్కన పెట్టేస్తారా?' అని ప్రశ్నించాడు.
అలాగే తనకు ఇస్తున్న అవకాశాలను పంత్ ఏమాత్రం ఉపయోగించుకవడం లేదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. 'నిజమే.. ఈ అవకాశాలను పంత్ అసలు యూజ్ చేసుకోవడం లేదు. ఎన్నడా పంతూ (ఏంట్రా ఇది పంతూ?)' అని అడిగాడు. 'వరల్డ్ కప్ దగ్గర పడింది. చాలా మంది ఇప్పటికే పంత్ పరుగులు చెయ్యడం లేదని అంటున్నారు. ఇప్పుడు ఇలా అవకాశాలు కూడా వేస్ట్ అయిపోతే.. అది అగ్నికి ఆజ్యం పోసినట్లే. వీటి వల్ల తనపై మరింత ఒత్తిడి పెరిగిపోతుంది' అని వివరించాడు. అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడని, క్రీజులో ముందు కుదురుకోవడానికి ప్రయత్నించాలని పంత్కు శ్రీకాంత్ సలహా ఇచ్చాడు.