స్కోరు ఏది?
ప్రపంచకప్ ఫైనల్లో పేసర్ షహీన్ అఫ్రిదీ గాయమే ఫలితాన్ని మార్చేసిందని బాబర్ ఆజమ్ అన్నాడు. మరికొందరు కూడా ఇది ఒక కారణం అవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ సునీల్ గవాస్కర్ దీన్ని ఒప్పుకోలేదు. పాక్ జట్టు కనీసం 15-20 పరుగులు తక్కువ చేసిందని, వాళ్లు 150పైగా స్కోరు చేసి ఉంటే బౌలర్లు ఏమైనా చేసేవారని చెప్పాడు. 'పాక్ చేసిన స్కోరు పెద్దది కాదు. కనీసం 15-20 పరుగులు వెనుకబడ్డారు. కాబట్టి షహీన్ ఒక 10 బంతులు వేసి ఉంటే ఫలితం మారిపోతుందనడం కరెక్ట్ కాదు' అని స్పష్టం చేశాడు.
మహా అయితే మరో వికెట్
ఈ మ్యాచ్ మధ్యలో హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ అందుకోవడంలో షహీన్ అఫ్రిదీ మోకాలికి గాయమైంది. దీంతో మైదానం వీడిన అతను కీలకమైన సమయంలో మళ్లీ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. కానీ ఒక్క బంతి వేయగానే ఇక అతని వల్ల కాలేదు. కుంటుకుంటూ మైదానం వీడాడు. షహీన్ తన కోటా పూర్తి చేసి ఉంటే మహా అయితే మరో వికెట్ తీసుకునే వాడని, అంతేకానీ ఇంగ్లండ్ విజయాన్ని అడ్డుకోలేడని సన్నీ చెప్పాడు. పాక్ బ్యాటింగ్ కనుక మరికొంత స్కోరు చేసి ఉంటే అప్పుడు గెలిచే అవకాశం ఉండేదన్నాడు.
తేలిపోయిన పాక్ బ్యాటర్లు..
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అంటే ధనాధన్ ఇన్నింగ్సులతో భారీ స్కోర్లు నమోదవుతాయని అంతా అనుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మాత్రం పేలవంగా ఆడింది. ఒక్కరంటే ఒక్కరు కూడా భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో ఆ జట్టు 137/8 స్కోరు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ హేల్స్ విఫలమైనా.. బట్లర్, స్టోక్స్, మొయీన్ అలీ వేగంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.