
ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఏడు వికెట్లు తీసుకొని ఆస్ట్రేలియాను వణికించాడు. దీనిపై జడ్డూతో గతంలో కలిసి పనిచేసిన మాజీ లెజెండ్ మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను గతంలో జడ్డూకు ఒక సలహా ఇచ్చానని, కానీ దాన్ని జడేజా ఆచరించలేదని చెప్పాడు. అయితే అప్పుడు తను తీసుకున్న నిర్ణయమే జడేజాకు కలిసొచ్చిందన్నాడు.
ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ జట్టుకు జడేజా ఆడాడు. అదే జట్టుకు కోచ్గా కైఫ్ పనిచేశాడు. అప్పటి ఘటనను గుర్తుచేసుకున్న కైఫ్.. 'గుజరాత్ లయన్స్తో ఉన్నప్పుుడ జడేజాకు ఒక సలహా ఇచ్చా. తన బౌలింగ్ మరీ ఒకే రకంగా ఉందని, ఏదైనా వేరియేషన్ను ప్రాక్టీస్ చేయాలని చెప్పా. క్యారమ్ బాల్స్ వేయడమో, లేదంటే సైడ్ ఆర్మ్తో బౌలింగ్ చేయడమో ట్రై చెయ్యమన్నా. కానీ అలా ఏదైనా చెడ్డ అలవాటు చేసుకుంటే టెస్టుల్లో బౌలింగ్ చేయడం తనకు కష్టం అయిపోతుందని జడ్డూ చెప్పాడు. అందుకే తన బౌలింగ్లో మార్పులు చేసుకోవడం కుదరదన్నాడు' అని వెల్లడించాడు.

ఇలా ఎప్పుడూ తన బలాలను అర్థం చేసుకొని జడ్డూ ఆడాడని మెచ్చుకున్నాడు. 'నేను చెప్తున్న ఘటన ఐదారేళ్ల క్రితానిది. అప్పుడే తన బలం ఏంటో జడ్డూకు తెలుసు. అతని రన్నప్ చాలా సింపుల్గా ఉంటుంది. అతని బలం యాక్యురసీ. ఒకే ప్రాంతంలో బంతిని విసరడం అతని స్పెషాల్టీ. జడ్డూ ఆ బలాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు' అని కొనియాడాడు.
అలాగే రకరకాల వేరియేషన్స్ జోలికి పోకుండా.. తనదైన స్టైల్లో రాణించడాన్ని మెచ్చుకున్నాడు. 'తను తీసుకున్న ఏడు వికెట్లలో ఒక్కదానిలో కూడా అతనేం కొత్తగా చెయ్యలేదు. ఎప్పట్లాగే బౌలింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అది చూస్తేనే తను ఫేమ్ కోసమో, మరొకదాని కోసమో ఆడటం లేదని తెలుస్తుంది' అని జడ్డూనే ఆకాశానికి ఎత్తేశాడు.