
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో అటు బ్యాటుతోనూ, ఇటు బంతితోనూ రాణించాడు. ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో అతను ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. మొదటి ఇన్నింగ్స్లో అంత అద్భుతంగా బౌలింగ్ చేస్తే రెండో ఇన్నింగ్స్లో మరింత ఎక్కువగా బౌలింగ్ ఇస్తారని అనుకుంటాం. కానీ జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం కుల్దీప్కు ఎక్కువ బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు.
ఇదే విషయాన్ని మాజీ లెజెండ్ రీతేందర్ సోధీ ఎత్తి చూపాడు. రాహుల్ ఏ వ్యూహంతో కుల్దీప్ను తక్కువగా ఉపయోగిస్తున్నాడో తనకు తెలియడం లేదన్నాడు. కానీ మొదటి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసుకున్న బౌలర్ను రెండో ఇన్నింగ్స్లో ఇంత తక్కువగా ఉపయోగించుకోవడం సరైన వ్యూహం కాదన్నాడు. దీని వల్ల కుల్దీప్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని, ఇలాంటి వ్యూహాలు ఆటగాళ్ల ఆటపై ప్రభావం చూపుతాయని హెచ్చరించాడు.

'అతనికి బౌలింగ్ ఇవ్వకుండా, డీప్లో ఫీల్డింగ్కు పంపితే.. తను బౌలింగ్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కెప్టెన్ తనను నమ్మడం లేదనే ఫీలింగ్ వస్తుంది. దీని గురించి రాహుల్తో టీం మేనేజ్మెంట్ చర్చిస్తుందని అనుకుంటున్నా. కుల్దీప్ను మరింత ప్రభావ వంతంగా ఉపయోగించుకోవాల్సిందని చెప్తుందేమో' అని రీతేందర్ సోధీ అన్నాడు. అక్కడితో ఆగకుండా కుల్దీప్లా ఫామ్లో ఉన్న బౌలర్ను తక్కువగా ఉపయోగించుకోవడం తనకు పెద్ద క్వశ్చన్ మార్కులా మారిందన్నాడు. వికెట్ టేకింగ్ బౌలర్ అయిన అతన్ని మరింత మెరుగ్గా యూజ్ చేసుకోవాల్సిందని సూచించాడు. మొదటి ఇన్నింగ్స్లో కుల్దీప్ సూపర్గా బౌలింగ్ చేశాడని, అలాంటి బౌలర్ కాన్ఫిడెన్స్ను పెంచాల్సిన బాధ్యత కెప్టెన్కు ఉంటుందన్నాడు.